బాలిక గ్యాంగ్రేప్.. రాళ్లతో కొట్టి హత్య: తండ్రి..నాలుగేళ్ల చిన్నారినీ వదల్లేదు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. 16 సంవత్సరాల బాలికపై ఆరుమంది కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిర్బంధించి.. కొన్ని గంటల పాటు నరకం చూపించారు. అనంతరం ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. ఆమె తండ్రి, నాలుగేళ్ల అక్క కుమార్తెనూ దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రహదారులపై బైఠాయించారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ దారుణానికి పాల్పడిన ఆరుమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్బా జిల్లాలోని గాధుప్రోడా గ్రామంలో కిందటి నెల 29వ తేదీన అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన తరువాత గానీ ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియ రాలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు..మృతురాలి కుటుంబానికి పరిచయస్తుడే. తండ్రి, నాలుగేళ్ల మనవరాలిని తన బైక్పై ఇంటి వద్ద డ్రాప్ చేయడానికి వెళ్లాడు. ఊరికి దూరంగా ఉంటోన్న ఆ ఇంట్లో ఆ ముగ్గురే నివసిస్తున్నట్లు తెలుసుకున్నాడు.
అదే రోజు రాత్రి అయిదు మంది స్నేహితులతో కలిసి ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమెముందే తండ్రి, నాలుగేళ్ల మనవరాలిని దారుణంగా హత్య చేశారు. ఆమెపై గ్యాంగ్రేప్కు పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని రాళ్లతో కొట్టి చంపారు. ముగ్గురి మృతదేహాలను అక్కడే పాతిపెట్టారు. మారుమూల గ్రామం కావడం వల్ల ఈ విషయం వెంటనే వెలుగులోకి రాలేదు. వారి బంధువులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దర్యాప్తు సందర్భంగా అసలు విషయం వెల్లడైంది. ఈ కేసులో సంత్రం మఝ్వార్, అబ్దుల్ జబ్బార్, అనిల్ కుమార్ సారథి, పర్దేశి రామ్ పనిక, ఆనంద్ రామ్ పనిక, ఉమాశంకర్ యాదవ్లను అరెస్ట్ చేశారు. వారందరూ గోధుప్రాడా పొరుగునే ఉన్న సంత్రెనకు చెందిన వారిగా గుర్తించినట్లు కోర్బా పోలీస్ సూపరింటెండెంట్ అభిషేక్ మీనా తెలిపారు. బర్పానీలో నివసిస్తోన్న మృతురాలి కుటుంబాన్ని పని ఇప్పిస్తానని ఆశచూపి, గాధుప్రోడాలో ఇంట్లో ఉంచాడని, అదే రోజు రాత్రి ఘాతుకానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.