సిఆర్పీఎఫ్ క్యాంప్పై ఉగ్రదాడి: 16 ఏళ్ల ఉగ్ర బాలుడి సంచలన వీడియో
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి కొత్త విషయం వెలుగు చూసింది. కేంద్ర సాయుధ పోలీు బలగాల (సిఆర్పీఎఫ్)పై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్ పుల్వామా జిల్లా లేథ్పొరా సిఆర్పీఎఫ్ క్యాంప్ భవనంలో చేపట్టిన గాలింపులో మూడో ఉగ్రవాది శవం బయటపడింది. ఆపరేషన్ పూర్తయింది. ముగ్గురు ఉగ్రవాదులు క్యాంప్పై ఆదివారం వేకువ జామున దాడి చేశారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా మరణించారు.
16 బాలుడు పోలీసు కుమారుడు...
జైషే మొహమ్మద్ ఉగ్రవాదులైన ముగ్గురిలో పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అతను పోలీసు కానిస్టేబుల్ కుమారుడు కావడం ఆశ్చర్యకరం. సిఆర్పీఎఫ్ శిబిరంపై దాడి చేయడానికి ముందు ఓ వీడియోను రికార్డు చేశాడు.అది ప్రస్తుతం వాట్సప్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ఇలా చెప్పాడు...
పదహారేళ్ల వయస్సు గల ఉగ్రబాలుడు 8 నిమిషాల పాటు వీడియోను రికార్డు చేశాడు. "భగవంతుడి కోరి, ఈ సందేశం మీకు చేరేలోగా, నేను స్వర్గంలో నా స్వామి వద్ద అతిథిగా ఉంటాను" అని ఆ 8 నిమిషాల వీడియోలోని మొదటి వాక్యాలు. జైషే మొహమ్మద్లో చేరాలని అతను విజ్ఞప్తి కూడా చేశాడు.
ఇలాంటిది ఇదే మొదటిసారి...
దాడి చేయడానికి ముందు ఇటువంటి రెచ్చగొట్టే మాటలను ఆత్మాహుతి దళ సభ్యుడు రికార్డు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు. భద్రతా బలగాలు ఆ వీడియోను పరిశీలిస్తున్నాయి.
ఇది తీవ్రమైందే
ఇది అత్యంత తీవ్రమైన విషయమేనని, స్థానిక యువకులు జనజీవన స్రవంతిలోకి తీసుకుని రావడానికి తాము కృషి చేస్తున్న సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని, చాలా మంది యువకులు మిలిటెన్సీకి స్వస్తి చెప్పి కుటుంబాల్లో చేరిపోతున్నారని, ప్రస్తుత సంఘటన మంచి సంకేతం కాదని అధికారులు అంటున్నారు.