చదువుకోవాలనే ఆశ.. ఆన్ లైన్ క్లాసులు వినలేని నిస్సహాయత.. చివరకు సూసైడ్...
కరోనా వైరస్ కొత్త కష్టాలను తీసుకొచ్చింది. వైరస్ వ్యాప్తితో విద్యా సంస్థలన్నీ మూతపడి ప్రస్తుతం ఆన్లైన్ విద్యా బోధన మాత్రమే జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే పేదింటి విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు కొనుక్కునేంత స్తోమత లేక... ఆన్లైన్ క్లాసులు వినలేక... మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళ,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన ఘటనలను మరిచిపోకముందే... ఇలాంటిదే మరో ఘటన అసోంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... అసోంలోని చిరంగ్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి మంగళవారం(జూన్ 23) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను పదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడటంతో ఆన్లైన్లో క్లాసులు వినాలని స్కూల్ యాజమాన్యం చెప్పింది.అయితే ఆ విద్యార్థిది నిరుపేద కుటుంబం కావడంతో స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్తోమత లేదు.
ఓవైపు రోజూ క్లాసులు జరుగుతున్నాయి... తాను మాత్రం స్మార్ట్ ఫోన్ లేని కారణంగా క్లాసులు వినలేకపోతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన అతను మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 'ఆ బాలుడిది నిరుపేద కుటుంబం. ఇటీవలే అతని తల్లి ఉపాధి కోసం బెంగళూరు వెళ్లింది. తండ్రికి ఉద్యోగమేమీ లేదు. ఆన్లైన్ క్లాసులు వినేందుకు కొడుక్కి స్మార్ట్ ఫోన్ కొనిచ్చేంత స్తోమత అతనికి లేదు.' అని చిరంగ్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. తన నిస్సహాయ స్థితిపై విరక్తి చెందిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. బాలుడి పోస్టుమార్టమ్ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది.