ప్రయాణికులంతా గాఢ నిద్రలో: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 22మంది మృతి!
బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది.
బరేలి: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత చోటు చేసుకున్న ఈ ఘటనలో బస్సు-ట్రక్కు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నట్లు తెలుస్తోంది. ఘటనలో 22మంది మృత్యువాత పడగా.. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బరేలీ షహ్జాన్ పూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద స్థలంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. బస్సును డ్రైవర్ సరైన మార్గంలో నడపనందువల్లే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో.. తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఆ వెంటనే మంటలు అంటుకోవడంతో ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.