ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది దుర్మరణం
దేశ రాజధానిలోని బవానా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని బవానా ప్రాంతంలో శనివారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలయ్యారు.
పారిశ్రామిక వాడలోని ప్లాస్టిక్ పరిశ్రమ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మూడంతస్తుల పరిశ్రమలో చెలరేగిన ఈ మంటల్లో తొలి అంతస్తులో 13 మంది మృతి చెందగా, కింది అంతస్తులో మరో నలుగురు మృతిచెందినట్టు అధికారులు చెబుతున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 నుంచి 20 అగ్నిమాపక యంత్రాలతో ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. గ్రౌండ్ఫ్లోర్లోనే మంటలు చెలరేగినట్టు భావిస్తున్నారు.
అయితే, ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొందరు కార్మికులు టెర్రస్ పైనుంచి కిందకు దూకి ప్రాణాలతో బయటపడ్డారు.
మహిళలతో పాటు ఇంకా కొందరు కార్మికులు పరిశ్రమలో చిక్కుకున్నట్టు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు