17 అంచెల భద్రత: మావోల ప్రాబల్యం ఉన్న దంతెవాడలో ప్రధాని పర్యటన
న్యూఢిల్లీ: భారత్లో అంతర్గత భద్రతు ఎలాంటి ఢోకా లేదని తెలియజేయడానికి గాను ప్రధాని నరేంద్రమోడీ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా దేశంలోనే మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ఈ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆనాడు మోడీ పర్యటనన తీవ్రంగా వ్యతిరేకించిన మావోలను మోడీ అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణించారు. ఆ తర్వాత మళ్లీ ఇంత వరకు ఆ ప్రాంతం వైపు తిరిగి చూడలేదు.
ఈనెల 9న బస్తర్ వెళ్లనున్న ప్రధాని మోడీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో కలిసి రెండు ప్రాజెక్టులకు శంకుస్ధాపన చేయడంతో పాటు దంతెవాడలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ దంతెవాడ పర్యటన నిమిత్తం ఆయనకు 17 అంచెల భద్రతను కల్పించనున్నారు. దంతెవాడ హైస్కూల్లో జరగనున్న భారీ బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని మోడీ కోసం సుమారు 10 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
ప్రధాని బస్తర్ పర్యటన నేపథ్యంలో వారంతంలో గిరిజనులచే నిర్వహించనున్న మార్కెట్లను మూసివేయనున్నట్లు తెలిపారు. ప్రధాని పర్యటించనున్న మార్గం మొత్తం కూడా కెమెరా కనుసన్నల్లో ఉండనుందని తెలిపారు. దీని పర్యవేక్షణ బాధ్యతను సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరో పాటు స్టేట్ ఇంటిలిజెన్స్ బ్యూరో కూడా పాలుపంచుకోనున్నాట్టు పేర్కొన్నారు. ప్రధాని పర్యటన నిమిత్తం సుమారు 10,000 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించనున్నారు.
ప్రధాని దంతెవాడ పర్యటన ఖరారైన నేపథ్యంలో సీఆర్పీఎప్ డైరెక్టర్ జనరల్ గత వారంలో రెండు రోజులు పర్యటించి సెక్యూరిటీపై ఛత్తీస్గడ్ పోలీసులతో భద్రతపై సమీక్షను నిర్వహించారు. ప్రధాని మోడీ దంతెవాడ పర్యటనలో భాగంగా జవాంగా గ్రామంలో గిరిజన విద్యార్ధులను కలిసి ఎడ్యుకేషన్ సిటీకి శంకుస్ధాపన చేస్తారు. ఆ తర్వాత ఛత్తీస్గడ్ రాజధాని నయా రాయ్పూర్లో మూడు కార్యక్రమాల్లో పాల్గొని రాత్రికి ఢిల్లీకి చేరుకుంటారు.