భారీ టీ స్కాం : రోజుకి 18,500 కప్పులా? తాగుతోంది మనుషులేనా?
ముంబై : మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయలో ఏడు రోజుల్లో సుమారు 3 లక్షల ఎలుకలను చంపారనే ఆరోపణపై రేగిన వివాదం చల్లారకమునుపే... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కార్యాలయంలో భారీ టీ స్కాం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో రోజుకి సగటున 18,500 కప్పుల టీ సర్వ్ చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
గత మూడేళ్లుగా సీఎంఓలో టీ వినియోగం పెరుగుతూ వచ్చిందని, దానికి తగ్గ ఖర్చులు కూడా పెరుగుతూ వచ్చాయని ముంబై కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆర్టీఐ ద్వారా పొందిన డాక్యుమెంట్లను ట్విటర్లో పొందుపరిచారు.
ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు 2015-16లో మహారాష్ట్ర సీఎంఓలో టీ కోసం వెచ్చించిన ఖర్చు సుమారు రూ.58 లక్షలు. అయితే ఇది 2017-18లో సుమారు రూ.3.4 కోట్లగా నమోదైనట్టు కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే టీ వినియోగం 577 శాతం మేర పెరిగిందని, అంటే సగటున సీఎంఓలో రోజూ 18,591 కప్పుల టీ సర్వ్ చేస్తున్నట్లు తేలుతోందని, కానీ ఇదెలా సాధ్యమని సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు.
ఎలాంటి టీని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాగుతారు? అని ప్రశ్నించగా.. తమకు తెలిసినంత వరకు ఆయన గ్రీన్ టీ, ఎల్లో టీ.. వంటివి తాగుతారని నిరుపమ్ పేర్కొన్నారు. అయితే సీఎం, సీఎంఓ ఎక్కువగా 'గోల్డెన్ టీ'కి వెచ్చిస్తున్నారని, అందుకే దీనికి ఎక్కువ మొత్తంలో ఖర్చు వస్తుందని చెప్పారు.
సీఎంఓ టీ బిల్లుల్లో అవినీతి చోటు చేసుకుందని తెలిపిన ఆయన... ప్రధాన మంత్రి 'ఛాయ్వాలా' అని చెప్పుకుంటూ ఎంతో గొప్పగా ఫీలవుతారని, మరోవైపు ఫడ్నవిస్ అనవసరంగా అదే ఛాయ్కి నిధులు ఖర్చుబెడుతున్నారని, చూస్తుంటే అటు ప్రధాని, ఇటు మహారాష్ట్ర సీఎం ఇద్దరూ కూడా దేశాన్ని ఛాయ్తోనే నడిపిస్తున్నట్లుంది అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
అంతేకాదు, అసలు ప్రతిరోజూ సీఎంఓలో 18,000 కన్నా ఎక్కువ మందికి టీ సర్వ్ చేయడం సాధ్యమయ్యే పనేనా? అని నిరుపమ్ ప్రశ్నించారు. లేదంటే ఆ టీ అంతటినీ మంత్రాలయంలోని ఎలుకలు తాగుతున్నాయా? అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర సచివాలయంలో ఎలుకలు పట్టుకునేందుకు ఇచ్చిన కాంట్రాక్ట్ విషయంలో అవకతవకలు జరిగినట్లు కొన్ని రోజుల క్రితమే వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం ఒక్క వారంలో మంత్రాలయలో సుమారు 3 లక్షల ఎలుకలను తొలగించినట్టు బీజేపీ మాజీ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే చెప్పారు. ఇప్పుడు ఎలుకల స్కాం మాదిరిగా సీఎంఓ ఆఫీసులో టీ స్కాం వెలుగులోకి వచ్చిందని నిరుపమ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.