యూకే నుంచి వచ్చిన 18 మందికి కొత్త రకం కరోనా పాజిటివ్: కేరళ మంత్రి శైలజ
తిరువనంతపురం: మనదేశంలో బ్రిటన్ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, బ్రిటన్ నుంచి కేరళకు వచ్చిన 18 మందికి కరోనావైరస్ పాజిటివ్గా తేలినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శైలజ మంగళవారం వెల్లడించారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందర్నీ హోం ఐసోలేషన్ చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇంతకుముందు బ్రిటన్ నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరి నమూనాల్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు మంత్రి శైలజ చెప్పారు. ఈ కొత్త రకం కరోనా వైరస్ త్వరగా సంక్రమించే స్వభావం కలిగి ఉండటంతో వృద్ధులు, పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
కేరళలో ఉన్న నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ భద్రతా కట్టుదిట్టం చేసినట్లు మంత్రి శైలజ తెలిపారు. కాగా, మనదేశంలో కొత్త రకం కరోనా వైరస్ ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. భారత్లో ఇప్పటికే మార్పులు చెందుతున్న కరోనా ఉన్నట్లు తేలడం గమనార్హం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ ఈ కరోనా కేసులు బయటపడ్డాయి. డిసెంబర్ 23-25 మధ్య కాలంలో 33వేల మంది యూకే నుంచి ఇండియాకు రాగా, వీరిలో మొత్తం 114 మందికి కరోనా సోకినట్లు తేలింది.
అయితే, కొత్త రకం కరోనాతో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని సీసీఎంబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి వేగం పెరగడంతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతేగాక, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.