18 మంది పోలీసుల మృతి: ఆందోళనలో ఖాకీలు, 1666 మందికి సోకిన వైరస్...
కరోనా ప్రబలకుండా డ్యూటీ చేస్తోన్న పోలీసులను వైరస్ కబళిస్తోంది. వైరస్ సోకిన ఖాకీలు మృత్యువాత పడుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రలో ఏకంగా 1666 మంది పోలీసులకు వైరస్ సోకింది. అయితే ఇందులో 18 మంది పోలీసులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరింత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో.. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
బాలాపూర్ ఏఎస్సైకి కరోనా పాజిటివ్, గాంధీలో చేరిక, 30 మంది సిబ్బందికి పరీక్షలు
అరుణ్ ఫడ్డారే వైరస్తో చనిపోయారని పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ తెలిపారు. ఇతను విలే పార్లే పీఎస్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వయసు పైబడటంతో.. అతను సెలవులో ఉన్నారు. అరుణ్ శుక్రవారం చనిపోయారని పేర్కొన్నారు. రెండురోజుల క్రితం ఏఎస్సై హరిభావు కూడా చనిపోయారు. అతను వైరస్ సోకి మృతిచెందడంతో పోలీసు వర్గాలు ఆందోళనకు గురవుతున్నాయి. పోలీసులకు వైరస్ కేసుల సంఖ్య పెరగడం డీజీపీని కూడా ఆందోళనకు గురిచేస్తోంది.మృతుల కుటుంబసభ్యులకు పోలీసు బాస్ సానుభూతి వ్యక్తం చేశారు.
తెలంగాణలో కూడా కొందరు పోలీసులకు వైరస్ సోకింది. వైరస్ సోకిన వారి సంఖ్య 8 కాగా.. ఇటీవల కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి చనిపోయారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా పోలీసు మరణం. నిన్న బాలాపూర్ ఏఎస్సై సుధీర్ కృష్ణకు కరోనా వైరస్ వచ్చింది. దీంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు.