లక్ష కోట్లు ప్రకటించారు కానీ.. ఒక్క రూపాయి ఇవ్వలేదు
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ కు ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ నుంచి నేటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా
ముంబై: 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ కు రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ ప్యాకేజీని ఆయన ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆ రాష్ట్రానికి విడుదల చేయలేదని సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తు ద్వారా వెల్లడయింది. ముంబైకి చెందిన ఆర్టీఐ కార్యకర్త అనిల్ గోల్గాలి ఈ అర్జీ దాఖలు చేశారు.
ప్రధాని మోడీ వివిధ రాష్ట్రాలకు ప్రకటించిన భారీ ప్యాకేజీలపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలకు సంబంధించి వివరాలు కోరుతూ అనిల్ 2016 డిసెంబరులో ఈ అర్జీ దాఖలు చేశారు. దీనిపై ఆర్థిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆనందర్ పర్మార్ స్పందించారు.
అయితే అనిల్ అర్జీకి నేరుగా సమాధానమివ్వడానికి నిరాకరించిన ఆయన మొత్తంగా కలిపి సమాచారం ఇచ్చారు. బీహార్ కు ప్రకటించిన రూ.1.25 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి చెబుతూ.. ప్యాకేజీ నిధులు విడుదల చేయకపోయినప్పటికీ.. బీహార్ లో ప్రాజెక్టులు, ఇతర పనులు దశల వారీగా పూర్తి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్యాకేజీ ప్రకటించి ఏడాదిన్నర అయినా నిధులు కొంచెం కూడా ఇవ్వలేదని ఆర్టీఐ కార్యకర్త అనిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్ కు ప్రకటించిన రూ.80 వేల కోట్ల ప్యాకేజీ, సిక్కింకు ప్రకటించిన రూ.43 వేల కోట్ల ప్యాకేజీ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉందన్నారు.