దారుణం: మార్కెట్కెళ్లిన యువతి సజీవ దహనం, లైంగిక దాడి జరిగిందా?
ఉన్నావో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల అమ్మాయిని గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా సజీవ దహనం చేశారు. ఉన్నావో జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. గ్రామం శివారుల్లో అత్యంత దారుణంగా కాలిపోయిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. బాధిత యువతి గురువారం సాయంత్రం తన సైకిల్పై మార్కెట్కు వెళ్లగా, గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు.
'ఆమె శరీరం వంద శాతం కాలిపోయింది. మృతదేహం పక్కనే సైకిల్ పడిపోయి ఉంది. ఆమె చెప్పులు, ఖాళీ పెట్రోలు డబ్బా, అగ్గిపుల్లలు ఆ పక్కనే కనిపించాయి. సజీవదహనం చేసినట్లు తెలుస్తోంది' అని పోలీసులు వెల్లడించారు.
ఘటనపై హత్య కేసు నమోదు చేశామని, ఆమెపై లైంగిక దాడి జరిగిందా? లేదా? అనే విషయం పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాతే తెలుస్తుందని పోలీసులు చెప్పారు.
సైకిల్, చెప్పుల ఆధారంగా ఆమెను గుర్తుపట్టారు ఆమె కుటుంబసభ్యులు. మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఘటనకు పాల్పడిన వారి వివరాలు, ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.