అత్యాచారం నుండి తప్పించుకొని, చివరికిలా...
18 ఏళ్ళ యువతిపై అత్యాచారం చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తే , వారి నుండి తప్పించుకొనేందుకుగాను పారిపోతూ రైలు ఢీకొని ఆమె చనిపోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకొంది.
భోపాల్:ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నిస్తే, వారి నుండి తప్పించుకొని పారిపోతూ 18 ఏళ్ళ యువతి రైలు ఢీకొని మరణించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.మృతురాలి కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దతియా జిల్లాలోని గోవింద్ పురా గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకొంది. ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఓ యువతి బహిర్భూమికి వెళ్ళింది.
అయితే అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. వారి బారి నుండి తప్పించుకొనేందుకుగాను బాధితురాలు ప్రయత్నించింది. నిందితుల నుండి ఎలాగోలా తప్పించుకొంది.
అంతే కాదు వారి నుండి తనను తాను రక్షించుకొనేందుకుగాను ఆమె రైలు పట్టాలపై పరుగెత్తింది.అయితే ఎదురుగా వచ్చిన రైలు ఆమెను ఢీకొట్టింది.బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికిప్పుడే తామేమీ చెప్పలేమంటున్నారు.యువతి తండ్రి తొలుత ఓ రకంగా తర్వాత వేరే రకంగా చెప్పారని పోలీసులు చెప్పారు.
తన ఇంటి సమీపంలో నివసించే ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు ముందు తోసేశారని తొలుత ఫిర్యాదు చేశారని చెప్పారు. అయితే తమ బంధువు జరిగిన ఘటనను చూశారని, ఆమె చెబితేనే అసలు విషయం తెలిసిందని బాధితురాలి తండ్రి చెప్పారు. మరుగుదొడ్లు లేని కారణంగానే బహిర్భూమికి వెళ్ళిన మహిళలు లైంగిక వేధింపులకు గురౌతున్నారు.