మునిగిపోయిన ముంబై.. స్తంభించిన మహానగరం.. భారీ వర్షాలకు 19 మంది బలి..
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. ముంబైతో పాటు శివారు ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజుల పాటు అతిభారీ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది.
రైలు సర్వీసులు రద్దు
వర్షాల కారణంగా ముంబై మహానగరం వరద నీటిలో మునిగిపోవడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో పట్టాలపైకి వర్షపు నీరు చేరడం రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది. ముంబై నుంచి రాకపోకలు సాగించే రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెస్ట్రన్ రైల్వే ప్రకటించింది. పట్టాలపై నీళ్లు చేరి లోకల్ రైళ్లు రద్దు కావడంతో ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నారు. వర్షాల నేపథ్యంలో ముంబైలో రైళ్ల రాకపోకలు, ప్రయాణీకుల భద్రతను రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పలు విమానాల దారి మళ్లింపు
మరోవైపు ప్రతికూల వాతావరణం పలు విమాన సర్వీసులపై ప్రభావం చూపింది. ముంబై ఎయిర్పోర్టులో స్పైస్ జెట్ విమానం అదుపు తప్పి బురదలో కూరుకుపోవడంతో ప్రధాన రన్ వేను మూసివేశారు. వానల కారణంగా కొన్ని సర్వీసులు రద్దుకాగా.. 54 ఫ్లైట్లను దారి మళ్లించారు. దీంతో ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాలకు 19మంది బలి
మహారాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ముంబైలోని మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద్ కాలనీలో గోడకూలిన ఘటనలో 13మంది మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో 12 మందిని హాస్పిటల్కు తరలించి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. పునేలోని అంబేగావ్లో కళాశాల గోడ కూలి ఆరుగురు మృతి చెందారు. భారీ వానలు పడుతుండటంతో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ సెలవు ప్రకటించింది. నవీ ముంబై, ముంబై, థానే, కొంకణ్ తదితర ప్రాంతాల్లో పాఠశాలలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
రూ.5లక్షల పరిహారం
వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, అధికారులను ఆదేశించారు.