సముద్రపు దొంగల చెర నుంచి 19 మంది భారతీయుల విడుదల.. నైజీరియాలోని మన రాయబారి చొరవతో..
పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియా తీరం సమీపంలో నెలరోజుల కిందట కిడ్నాప్ కు గురైన 19 మంది భాయతీయులను సముద్రపు దొంగలు ఎట్టకేలకు విడిచిపెట్టారు. డిసెంబర్ 15వ తేదీన ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. అనుకోని రీతిలో ఓ బాధితుడు చనిపోగా, మిగిలిన 19 మందిని ఆదివారం విడుదల చేశారు.
కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే నైజీరియా ప్రభుత్వంతో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు చేసింది. నెలరోజుల నాటకీయ పరిణామాల తర్వాత ఖైదీల విడుదలకు పైరేట్లు అంగీకరించారు. నైజీరియా(అబూజా)లోని భారత హైకమిషనర్ అభయ్ ఠాకూర్ చొరవతో పెద్ద గండం తప్పినట్లయింది.
ఖైదీల విడుదలలో నైజీరియా ప్రభుత్వం కూడా భారత్ కు సహకరించిందని, కిడ్నాపైన 20 మందిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 19 మంది శనివారం రాత్రి విడుదలయ్యారని, ఒకటి రెండు రోజుల్లో వారిని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని రాయబారి ఠాకూర్ ట్విటర్ లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నైజీరియా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఆఫ్రికా పశ్చిమ తీరంలో భారతీయులు కిడ్నాప్ కు గురైన ఘటనలు గతేడాది చివర్లో రెండు జరిగాయి. మొదటిది.. హాంకాంగ్ జెండాతో ఉన్న ఓడలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయుల్ని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేసి, కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టారు. ఆ ఘటన జరిగిన 10 రోజులకే ఎంటీ డ్యూక్ నౌక నుండి 20 మంది భారతీయ నౌక సిబ్బందిని దొంగలు అపహరించారు.