నలుగురు కామాంధుల చేతిలో గ్యాంగ్రేప్..చిత్రవధ: 19 ఏళ్ల యువతి మృతి: ఎమ్మెల్యే సీతక్క షాక్
న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేసిన నిర్భయ ఉదంతంలో నలుగురు దోషులకు ఉరికంబాన్ని ఎక్కించిన తరువాత కూడా.. కామాంధుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. తమ దారుణ ఆకృత్యాలను యధాతథంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తమ కామదాహానికి యువతలను బలి తీసుకుంటూనే ఉన్నారు. నిర్భయ ఘటనను తలపించేలా ఉత్తర ప్రదేశ్లోని హత్రాస్లో నలుగురు దుర్మార్గుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతి.. మృత్యువుతో పోరాడుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని బాధితురాలి సోదరుడు ధృవీకరించినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
36 ఏళ్ల సర్వసంగ పరిత్యాగిణి.. అయినా వదల్లేదు: గ్యాంగ్రేప్: నిందితుల కోసం సిట్
యువతిపై అమానవీయ దాడి..
హత్రస్కు 19 సంవత్సరాల దళిత యువతి నలుగురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి, సోదరుడితో కలిసి పొలం పనుల కోసం వెళ్లిన బాధితురాలపై హత్రాస్కే చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ సమయంలో బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ నలుగురూ విచక్షణారహితంగా ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఇష్టానుసారంగా కొట్టారు. చిత్రవధకు గురి చేశారు. తమ పేర్లను బయటపెట్టకుండా ఉండటానికి బాధితురాలి నాలుకను కత్తిరించారని వస్తున్న వార్తలను ఖండించారు జిల్లా కలెక్టర్. ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు.
నలుగురు అనుమానితులుగా..
ఈ దారుణతో ఆమె శరీరంలో పలుచోట్ల ఫ్రాక్చర్స్ ఏర్పడ్డాయి. ఈ ఘటనలో హత్రాస్కే చెందిన సందీప్, రాము, లవ్ కుష్, రవి అనే నలుగురిని పోలీసులు అనుమానితులుగా అరెస్టు చేశారు. తీవ్ర రక్తస్రావంతో కనిపించిన ఆమెను కుటుంబ సభ్యులు మొదట అలీగఢ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మరింత మెరుగైన చికిత్స కోసం దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్)కు తరలించారు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తూ వచ్చారు డాక్టర్లు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం మరణించారు. బాధితురాలు మరణించిన విషయాన్ని ఆమె సోదరుడు ధృవీకరించారు.
సీతక్క ఆవేదన..
అత్యాచార బాధితురాలు మరణించడం పట్ల దేశవ్యాప్తంగా నిరసలు చెలరేగుతున్నాయి. బాధితురాలికి న్యాయం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సైతం తన గళాన్ని వినిపించారు. దళిత యువతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇంకా ఎంతమంది అమ్మాయిలు బలి కావాలి? అంటూ సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలిపై అమానవీయంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కామాంధులు ఆమె నాలుకను కత్తిరించారని, మెడ విరిచేశారని, అలాంటి వారిని వదిలిపెట్టొద్దని సీతక్క అన్నారు.
Recommended Video
కాంగ్రెస్ నేతల ఘాటు విమర్శలు..
మరోవంక- ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఈ ఘటన పట్ల తీవ్రంగా స్పందిస్తున్నారు. యోగి ఆదిత్యానాథ్ సారథ్యలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. బీజేపీ పాలనలో మహిళలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయిందని మండిపడుతున్నారు. నిందితులపై ఎందుకు కఠిన చట్టాల కింద కేసు నమోదు చేయట్లేదని నిలదీస్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానథ్ ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని పట్టుబడుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను పరామర్శించాలని నిర్ణయించారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రియాంకా గాంధీ వాద్రా నేతృత్వంలో కాంగ్రెస్ నేతల ప్రత్యేక బృందం హత్రాస్ వెళ్లి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.