మూడేళ్ల ప్రేమ, పెళ్లంటే అక్రమ సంబంధం..: బైక్పై ప్రియురాలి శవంతో పోలీస్స్టేషన్ కు..
కర్ణాటకలోని బళ్లారిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించాడు, పెళ్లంటే నీలో ఏదో లోపముందన్నాడు. దీంతో అతడ్ని ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
బళ్లారి: కర్ణాటకలోని బళ్లారిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించాడు, పెళ్లంటే నీలో ఏదో లోపముందన్నాడు. దీంతో అతడ్ని ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ప్రియుడు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిరిగేరి గ్రామానికి చెందిన దావల్ సాబ్(24) అనే యువకుడు, చాకలి హనుమంతి(21) అనే యువతిని ప్రేమించాడు. వీరి మధ్య గత మూడేళ్ల నుంచి ఈ ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, ప్రేమ విషయం తెలియడంతో దావల్ తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు.
అంతేగాక, అతనికి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కాగా, ఈ విషయం తెలిసిన హనుమంతి.. తనను వెంటనే పెళ్లి చేసుకోవాలని దావల్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో మూడేళ్లుగా ప్రేమించిన హనుమంతిని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు దావల్.
ఈ క్రమంలో గత ఆదివారం ఆమెను బైక్పై తీసుకెళ్లిన దావల్.. గ్రామ శివారులో ఆమెతో వాగ్వాదం పెట్టుకున్నాడు. 'నీలో లోపం వుంది. నీకు వేరొకరితో సంబంధం ఉన్నట్లు తెలిసింది. నాకు పెళ్లి నిశ్చయమైంది. నీవు ఉంటే నా పెళ్లికి అడ్డంకి అవుతావు. చస్తే చావు' అని ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.
దీంతో మనస్తాపానికి గురైన సదరు యువతి దూరంగా ఉన్న చెట్టు వద్దకు వెళ్లి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎంతకూ రాకపోవడంతో దావల్ అక్కడికి వెళ్లి చూశాడు. అప్పటికే మృతి చెందిన హనుమంతిని బైక్పై ఎక్కించి నేరుగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దావల్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.