భర్త విధులకు వెళ్తే.. భార్యపై గ్యాంగ్రేప్ చేశారు
సూరత్: గుజరాత్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త లేని సమయాన్ని అదునుగా చూసుకొని ముగ్గురు దుర్మార్గులు ఓ వివాహిత(19)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన పుణె-ముంబై రోడ్డులోని మార్కెట్ సమీపంలోగల రెసిడెన్షియల్ సొసైటీలో చోటుచేసుకుంది.
ఘటనపై బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వడదోర పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్స్ టైల్స్ కంపెనీలో బాధితురాలి భర్త నైట్ షిప్టులో పనికి వెళ్లాడు. అదే సమయంలో ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఇంటిపక్కనే ఉన్న వ్యక్తి మరో ఇద్దరు అతని స్నేహితులతో కలిసి ఆమె ఇంటి తలుపుకొట్టాడు.
కాగా, ఇంటి ముందు గదిలో ఆమె సోదరుడు నిద్రస్తుండటంతో అతడు లేచి తలుపు తీశాడు. వెంటనే ఓ వ్యక్తి అతడిని గదిలో పడేసి తాళం వేశాడు. అనంతరం లోపలికి వెళ్లి నిద్రిస్తున్న వివాహితపై లైంగికదాడికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన బయటకు చెబితే తన సోదరుడిని చంపేస్తామని బెదిరించి వరుసగా ముగ్గురు లైంగిక దాడి చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు సోనూ కుష్వా, పప్పన్ కుష్వా, అన్నుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.