దేశంలోనే తొలిసారి: మహిళపై అత్యాచారం చేసిన మరో మహిళ...కేసు నమోదు
ఢిల్లీ: ఇప్పటివరకు ఓ పురుషుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటనను చూశాం. అతడిపై కేసు నమోదు కావడం ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవడం చూశాం. కానీ ఢిల్లీలో ఇందుకు భిన్నంగా జరిగింది. . పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు. ఓ మహిళపై మరో మహిళ అత్యాచారం చేయడం చర్చనీయాంశమైంది. అయితే తొలిసారిగా సెక్షన్ 377 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది భారత చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ముఖ్యంగా సుప్రీంకోర్టు గతేడాది సెప్టెంబరులో గే లేదా లెస్బియన్ సెక్స్ నేరం కాదని తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైంది.
బాధిత మహిళ ఫిర్యాదు ప్రకారం తన నడుముకు పురుషుడి కృత్రిమ అవయవాలు కట్టుకుని తనపై బలవంతంగా లైంగిక దాడి చేసిందని పోలీసులకు చెప్పింది. కేసులో నిందితురాలిగా ఉన్న శివానీ అనే మహిళను పోలీసులు కార్కర్దూమ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. దీంతో శివానీని తీహార్ జైలుకు తరలించారు. నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 377 కింద కేసు నమోదు చేశారు. సుప్రీం కోర్టు ఒకే లింగానికి చెందిన వారు లైంగిక చర్యల్లో పాల్గొంటే అది నేరం కాదని గతేడాది తీర్పు వెలువరించింది.
ఇదిలా ఉంటే ఢిల్లీలో పనిచేసేందుకు తాను ఈశాన్య రాష్ట్రం నుంచి వచ్చినట్లు తెలిపిన బాధితురాలు... శివానీ తనపై పలుమార్లు లైంగిక దాడికి తెగబడటమే కాకుండా తనను మానసికంగా కూడా చిత్రహింసలకు గురిచేసిందని వెల్లడించింది. అంతకుముందు బాధిత మహిళకు కష్టాలు మార్చి 2018 నుంచే మొదలైనట్లు తెలుస్తోంది. గురుగ్రామ్లో తాను చేస్తున్న ఉద్యోగం వదిలి సొంత వ్యాపారం పెట్టుకుందామని నిర్ణయించుకుంది. ఓ బట్టల వ్యాపారంలో మరో కొందరితో పెట్టుబడి పెట్టించేందుకు ఒప్పందం కుదర్చుకుంది. ఇక వ్యాపారంలో భాగంగా... బాధితురాలు బస్స్టాపుల్లో, రైల్వే స్టేషన్లలో ఇతరుల దగ్గరకు వెళ్లి తమ ప్రతిపాదనలు గురించి వివరించేది. ఈ క్రమంలోనే తాను రోహిత్ అనే వ్యక్తి పరిచయం కావడం ఆ తర్వాత తాను ఇన్వెస్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పడం జరిగిపోయింది.
ఆ తర్వాత బాధితురాలిని రోహిత్ ఓ అపార్ట్మెంట్లోకి తీసుకెళ్లి అప్పటికే అందులో ఉన్న రాహుల్ అనే వ్యక్తితో కలిసి ఈ అమ్మాయిపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమె నగ్న దృశ్యాలు రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేశారు. ఇక అప్పటి నుంచి తనను ఆ అపార్ట్మెంటులోనే బంధించారని వెల్లడించింది. అందులో శివాని అనే ఈ మహిళను ఉంచారని ఆమె తనను చిత్రహింసలకు గురిచేసిందని ఫిర్యాదులో పేర్కొంది. శివానీతో పాటు ఇతర ఇద్దరు వ్యక్తులు కూడా శిక్షించబడాలని బాధితురాలు కోరింది.