కలకలం రేపుతోన్న మరో దిశ ఘటన.. టోల్ ప్లాజా సమీపంలో యువతిపై అత్యాచారం..
హైదరాబాద్ శివారులోని షాద్ నగర్ టోల్ ప్లాజా సమీపంలో దిశ హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనను ఇంకా మరవకముందే హర్యానాలో మరో దిశ తరహా ఘటన చోటు చేసుకుంది. కర్నల్ జిల్లాలోని ఓ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఓ మహిళను అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మధుబన్ పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి పానిపట్ నుంచి తన భర్తతో కలిసి ఆ యువతి(19) బస్సులో తమ ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఓ బంధువును కలిసేందుకు టోల్ ప్లాజా వద్ద దిగారు. ఆ సమయంలో రోడ్డు పక్కనున్న ఓ టీ స్టాల్ వద్ద టీ తాగేందుకు ఆమె భర్త వెళ్లగా.. సమీపంలో ఉన్న ఓ టాయిలెట్ వద్దకు ఆ యువతి వెళ్లింది. ఆమె టాయిలెట్ వెళ్లడాన్ని గమనించిన ఇద్దరు దుండగులు.. కత్తులతో బెదిరించి ఆమెను కిడ్నాప్ చేశారు.
అనంతరం టోల్ ప్లాజా సమీపంలోని కుతైల్ అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం జరిపారు. ఆపై అక్కడినుంచి పారిపోయారు. ఘటన తర్వాత బాధితురాలు భర్తతో కలిసి మధుబన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సింగ్ అనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. దిశ హత్యాచార ఘటనలో నిందితులను ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా.. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.