చిన్న గొడవే.. చితకబాది మూత్రం తాగించారు.. మధ్యప్రదేశ్లో దారుణం..
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. బోర్ పంప్ వద్ద తలెత్తిన చిన్న వివాదం ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్లింది. తన చావుకు ఆ ముగ్గురే కారణమంటూ ఆత్మహత్యకు ముందు అతనో సెల్ఫీ వీడియో కూడా రికార్డ్ చేశాడు. తనపై దాడి చేయడమే కాకుండా.. బలవంతంగా మూత్రం తాగించే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల బీహార్లోనూ ముగ్గురు మహిళలపై దాడి చేసి మూత్రం తాగించిన ఘటన మరవకముందే మరో ఉత్తరాది రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
అసలేం జరిగింది..
మధ్యప్రదేశ్లోని శివ్పురి జిల్లా బాగ్రసజోర్ గ్రామానికి చెందిన వికాస్ శర్మ ఇటీవల తమ ఇంటి సమీపంలోని ఓ బోర్ పంప్ వద్ద గోనె సంచిని శుభ్రం చేసేందుకు వెళ్లాడు. అప్పటికే ముగ్గురు మహిళలు తమ బకెట్లలో నీళ్లు పట్టుకుని పక్కన పెట్టుకున్నారు. వికాస్ శర్మ గోనె సంచిని శుభ్రం చేస్తుండగా ఆ నీళ్లు బకెట్లలో పడ్డాయి. దీంతో మనోజ్,ప్రియాంక,తారావతి అనే ముగ్గురు అతనిపై దాడికి పాల్పడ్డారు. అక్కడితో ఆగకుండా మరింత దౌర్జన్యానికి పాల్పడ్డారు.
క్షమాపణలు చెప్పినా..
వికాస్ శర్మ క్షమాపణ చెప్పినా.. ఆ ముగ్గురూ వినిపించుకోలేదు. జుట్టు పట్టుకుని చితకబాదారు. అనంతరం మనోజ్ శర్మ ఓ పాత్రలో మూత్రం పోయగా.. ముగ్గురు కలిసి బలవంతంగా అతనితో తాగించే ప్రయత్నం చేశారు. జరిగినదాన్ని తీవ్ర అవమానంగా ఫీలైన వికాస్.. పరుగున ఇంటికెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు మనోజ్,ప్రియాంక,తారావతియే కారణమంటూ ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేశాడు.
అదే కారణమా..?
'వాళ్లు నా పట్ల చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు. అమ్మా,నాన్నా మీతో ఒక్క మాటైనా చెప్పకుండా నన్ను క్షమించండి. గుల్షన్ను బాగా చూసుకోండి. వాళ్లు చేసినదానికి కఠిన శిక్ష అనుభవించి తీరాలి.' అంటూ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని ఎస్పీ రాజేశ్ చందెల్ తెలిపారు. గతంలోనూ ఇరువురి కుటుంబాల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయని చెప్పారు. ఆర్నెళ్ల క్రితం మనోజ్ సోదరుడిని శర్మ బంధువు ఒకరు హత్య చేశారని చెప్పారు. అదే కక్షతో శర్మపై దాడి చేసినట్టు అనుమానిస్తున్నట్టు తెలిపారు.