ఇంట్లో నుంచి పారిపోతే.. మాయమాటలు చెప్పి యువతిని అమ్మేసింది!
రాయ్పూర్: మనుషుల అక్రమ రవాణాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అలాంటి కార్యకలాపాలను కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఒంటరిగా ఉన్న ఓ గిరిజన యువతి (19)కి ఓ మహిళ మాయమాటలు చెప్పి, ఆమెను రూ. 30వేలకు అమ్మేసింది. దీనిపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాధితురాలిని రక్షించారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే. ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతానికి చెందిన బాధిత గిరిజన యువతి ఇంట్లో గొడవపడి వెళ్లిపోయింది. ఓ రోడ్డు పక్కన ఒంటరిగా ఉన్న ఆమెను కల్పనా మండల్(36) అనే మహిళ ఏజెంట్ చేరదీసింది. కల్పన.. ఆ గిరిజన యువతిని తొలుత ఒడిశాకు తీసుకెళ్లి అక్కడ టీనా అనే మరో మహిళను కలిసింది.
బాధితురాలు ఇంటికి వెళ్తానని చెప్పినా.. కల్పన, టీనా ఆమెకు మాయమాటలు చెప్పి ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్లి ఓ వృద్ధుడికి ఆమ్మేశారు. పెళ్లి చేసుకునేందుకు ఆ వృద్ధుడు గిరిజన యువతిని కొనుగోలు చేశాడు. కల్పన, టీనా డబ్బులు తీసుకుని వెనక్కురాగా, బాధితురాలు అక్కడే చిక్కుకుపోయింది.
బాధితురాలు ఇంట్లో నుంచి వెళ్లాక తిరిగిరాకపోవడంతో జూన్ 20న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులై 3న ఉత్తరప్రదేశ్ నుంచి బాధితురాలిని తీసుకువచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అమాయక యువతులను మాయమాటలతో ఇతరులకు అమ్మేస్తున్నారని, కొందర్నీ వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని పోలీసులు తెలిపారు.