ఓఖీ తుపాను: వారందరూ గల్లంతు అయ్యారు: తమిళనాడు ప్రభుత్వం, ఇప్పటికీ !
చెన్నై: 2017 డిసెంబర్ నెల మొదటి వారంలో కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడును అతలాకుతలం చేసిన ఓఖీ తుపాను కారణంగా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు గల్లంతు అయిన మాట వాస్తవమే అని గురువారం ఆ రాష్ట్ర మత్య్సశాఖ మంత్రి జయకుమార్ అంగీకరించారు. ఇప్పటి వరకూ ఆచూకిలేని వారందరూ గల్లంతు అయ్యారని ఇప్పటికి వెలుగు చూసింది.
ఓఖీ తుపాను
2017 డిసెంబర్ మొదటి వారంలో మూడు రోజుల పాటు లక్షద్వీప్, తమిళనాడు, కేరళను ఓఖీ తుపాను అతలాకుతలం చేసింది. అప్పటికే సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్లిన మత్స్యకారులు ఓఖీ తుపాను దెబ్బకు గల్లంతు అయ్యారు.
కేంద్రం ఆరా
ఓఖీ తుపాను నష్టం పరిశీలించడానికి మొదట కేంద్ర ప్రభుత్వం తరపున రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ కన్యాకుమారి జిల్లాలో పర్యటించారు. అనంతరం కేరళలో కూడా రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు.
ప్రధాని మోడీ, రాహుల్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీప్, తమిళనాడు, కేరళలో పర్యటించి ఓఖీ తుపాను బాధితులను పరామర్శించారు. ప్రధాని మోడీ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి, కేరళలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.
ప్రతిపక్షాలు డిమాండ్
ఓఖీ తుపాను కారణంగా కన్యాకుమారి జిల్లాతో పాటు అనేక ప్రాంతాల్లోని మత్స్సకారులు సముద్రంలోకి వెళ్లి గల్లంతు అయ్యారని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ ఆరోపించారు. సుమారు 750 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతు అయ్యారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి గురించి పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు విమర్శించాయి.
194 మంది గల్లంతు !
ఓఖీ తుపాను సందర్బంగా సముద్రంలోకి వెళ్లిన 194 మంది మత్స్యకారులు గల్లంతు అయ్యారని, ఇప్పటి వరకూ వారి ఆచూకి చిక్కడం లేదని తమిళనాడు మత్య్సశాఖ మంత్రి జయకుమార్ గురువారం చెప్పారు. వారి కోసం ఇప్పటికీ తాము గాలిస్తున్నామని మంత్రి జయకుమార్ వివరించారు.