ప్రేమ ఎంత మధురం:1942..ఎ లవ్ స్టోరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి
Recommended Video
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అందరికీ ఒక మంచి నేతగా, మంచి వక్తగా, మంచి రాజకీయ చాణక్యుడిగానే తెలుసు. అంతకుమించి అతను ఆజన్మ బ్రహ్మచారిగానే తెలుసు. అటల్ జీ అలా ఎందుకు బ్రహ్మచారిగానే మిగిలిపోయారనేది చాలామందికి తెలియదు...ఆ రోజుల్లో వాజ్పేయి ఒక ప్రేమకథను కూడా నడిపారు. ఆయన కాలేజీ చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడి తన ప్రేమను వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
కళ్లు కళ్లు కలిసింది ఇక్కడే..!
1942లో గ్వాలియర్లోని విక్టోరియా కళాశాలలో వాజ్పేయి చదువుకున్నారు. అదే కాలేజీలో తన క్లాస్మేట్ రాజకుమారిని తొలి చూపులోనే అటల్ ఇష్టపడ్డారు. ఆమెను గాఢంగా ప్రేమించారు. అప్పట్లో ప్రేమికులు గంటల తరబడి మాట్లాడుకునేవారు కాదు. వాజ్పేయి పరిస్థితి కూడా అంతే. రాజకుమారిని దూరం నుంచే చూసి సంబరపడిపోయేవారు. రాజకుమారికి కూడా వాజ్పేయి అంటే చాలా ఇష్టం. ఇద్దరి చూపులు కలిశాయి. లైబ్రరీలో మాత్రమే ఇద్దరు మాట్లాడుకునేవారు. కళ్లతో ప్రేమించుకునేవారు. అయితే ఒకరికొకు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తున్నామని ధైర్యంగా చెప్పుకోలేకపోయారు. ఆరోజుల్లో నేరుగా అమ్మాయి దగ్గరకు వెళ్లి ప్రేమ వ్యక్తపరిచేందుకు కాస్త జంకేవారు. ఇక రాజకుమారిని పెళ్లి చేసుకుందామని వాజ్పేయి డిసైడ్ అయిపోయారు. ఎప్పటిలానే సినిమాల్లోలా... వాజ్పేయి రాజకుమారికి ఒక ప్రేమలేఖ రాసి ఒక పుస్తకంలో ఉంచి ఆమెకు అందజేశారు. ఇక వాజ్పేయి రాజకుమారి స్పందన కోసం ఎదురుచూశారు. రెండు మూడు రోజులైనా అటువైపునుంచి ఎలాంటి స్పందన రాలేదు.
వాజ్పేయి-రాజకుమారిల ప్రేమను అడ్డుకున్న పెద్దలు
వాజ్పేయి రాసిన లేఖను రాజకుమారి చదివారు. ఆమె సమాధానం కూడా రాసి అదే పుస్తకంలో పెట్టారు. అయితే వాజ్పేయిని కలిసి పుస్తకం ఇచ్చే ఛాన్స్ ఆమెకు దొరకలేదు. అదేసమయంలో కొన్ని వ్యక్తిగత కారణాలతో వాజ్ పేయి ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆ లేఖ వాజ్పేయి వరకు చేరలేదు. వాజ్పేయిని వివాహం చేసుకుంటానని రాజకుమారి తల్లిదండ్రలకు చెప్పినప్పటికీ... వారు ఒప్పుకోలేదు. ఇద్దరూ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన వారైనా.. రాజకుమారి కుటుంబం శాఖపరంగా, గోత్రపరంగా ఉన్నతమైన కుటుంబం కావడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. వారి ప్రేమను ఆదిలోనే తుంచేశారు. ఇక తల్లిదండ్రులను ఎదరించలేక రాజకుమారి వారు చూపిన సంబంధమే చేసుకుంది. 1947లో బ్రజ్ నారాయణ్ కౌల్ అనే కాలేజీ లెక్చరర్కిచ్చి రాజకుమారి పెళ్లి చేసేశారు.
చాలా ఏళ్ల తర్వాత అటల్జీకి ఢిల్లీలో కనిపించిన రాజకుమారి
రాజకుమారి వివాహం జరిగిందని తెలుసుకున్న వాజ్పేయి కొన్ని రోజులు చాలా బాధపడ్డాడు. ఇక అప్పటినుంచి వాజ్పేయి పెళ్లి చేసుకోకుండా పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. ఎక్కువ రోజులు ఢిల్లీలోనే ఉండేవారు. ఒకానొక సందర్భంలో రాజకుమారిని వాజ్పేయి ఢిల్లీలో కలిశారు. రాజకుమారి భర్త ఢిల్లీ వర్శిటీ పరిధిలోని రామజా కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు. అక్కడ భార్యాభర్తలిద్దరిని వాజ్పేయి కలిసేవారు. బ్రజ్ నారాయణ్తో స్నేహం ఏరడటంతో వాజ్పేయి ఇంటికి వారు... వారింటికి వాజ్పేయి రాకపోకలు కొనసాగిస్తుండేవారు.
భర్త మృతితో వాజ్పేయి నివాసానికి రాజకుమారి మకాం
రాజకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలు. నమిత, నమ్రత. కొన్ని రోజులకు ప్రొఫెసర్ కౌల్ మరణించడంతో ఆ కుటంబం వాజ్పేయి నివాసానికి మకాం మార్చింది. రాజకుమారి ఇక అప్పటి నుంచి వాజ్పేయితో కొన్ని దశాబ్దాల పాటు ఉన్నప్పటికీ... ఎప్పుడూ ఆయనతో కలిసి బయట కనిపించలేదు. 2014 ఎన్నికల సమయంలో రాజకుమారి మృతి చెందింది. ఆ సమయంలో ఆమెకు అద్వానీతో పాటు పలువురు బీజేపీ అగ్రనాయకులు వాజ్పేయి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. రాజకుమారి కుమార్తె నమితను వాజ్పేయి దత్తత తీసుకున్నారు. నమితకు పుట్టిన ఆడపాప నీహారికా అంటే తాతయ్య వాజ్పేయికి ఎంతో ప్రాణం. ఇలా వాజ్పేయి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ పెద్దలు ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆజన్మ బ్రహ్మచారిగానే ఉండాలని ఆనాడే నిర్ణయించుకుని... అలానే ఉండిపోయారు.