కన్నీటి గాథ: అభినందన్ విడుదలయ్యాడు...మరి 1971 యుద్ధంలో పట్టుబడ్డ జవాన్ల పరిస్థితి ఏంటి..?
ఫిబ్రవరి 27న పాకిస్తాన్కు బంధీగా పట్టుబడ్డ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఆ తర్వాత మార్చి 1న భారతగడ్డపై అడుగుపెట్టాడు. అభినందన్ వర్థమాన్ విడుదలకు ప్రపంచ దేశాల నుంచి పాకిస్తాన్పై ఒత్తిడి రావడంతో ఆదేశం ఆయన్ను విడుదల చేసింది. ఇక పాక్ జైళ్లలో ఇంకా ఇలా మగ్గుతున్న అభినందన్లు చాలా మంది ఉన్నారు. యుద్ధ ఖైదీలుగా పట్టుబడి పాక్లోని పలు జైళ్లలో ఇంకా శిక్ష అనుభవిస్తూనే ఉన్నారు. మరి వారంతా ఎప్పుడు బయటకొస్తారు... పాక్ చెర నుంచి వీరి విడుదలకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందా...?
నాడు యుద్ధంలో పట్టుబడ్డ 54 మంది భారత జవాన్లు
పాకిస్తాన్లో యుద్ధ ఖైదీలుగా పలువురు భారతీయులు ఇంకా మగ్గుతూనే ఉన్నారు. వివిధ సందర్భాల్లో పాకిస్తాన్ సైన్యానికి చిక్కి అక్కడ యుద్ధ ఖైదీలుగా శిక్ష పొందుతున్నారు. అలా మొత్తం 54 మంది భారతీయులు బంధీలుగా వివిధ పాక్ చెరలో ఉన్నారు. ఇప్పటికే కొందరి ఆరోగ్యం క్షీణించగా మరికొందరి మానసిక పరిస్థితి ప్రశ్నార్థకంగా మారినట్లు సమాచారం. ఇంకొందరు అనుమానాస్పద రీతిలో మృతి చెందారని ఓ ఆర్మీ మాజీ అధికారి రిటైర్డ్ బ్రిగేడియర్ హర్వంత్ సింగ్ తెలిపారు. అంతేకాదు ఇప్పటికీ పాక్ సైన్యం చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారని ఆయన చెప్పారు.
ఫ్లాష్ బ్యాక్ : కార్గిల్ యుద్ధంలో యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ పైలట్ నచికేత ఎలా విడుదలయ్యారు?
నాడు స్మార్ట్ ఫోన్లు లేవు.. అందుకే వారికీ దుస్థితి
1971లో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధంలో భారత సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకుని పాకిస్తాన్ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు హర్వంత్ సింగ్. నాడు వీరిపై తప్పుడు ఆరోపణలతో కూడిన డాక్యుమెంట్లను పాకిస్తాన్ సృష్టించిందని హర్వంత్ సింగ్ చెప్పారు. ఇదే విషయమై నాటి ప్రధానికి చెప్పామని ఆయన పర్వేజ్ ముషారఫ్తో మాట్లాడినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ వాస్తవాలను డాక్యుమెంట్లలో పొందపరచి ఉండి ఉంటే నాడు పాక్ అధీనంలోకి వెళ్లిపోయిన జవాన్లు ఈ పాటికి విడుదలై సంతోషంగా తమ కుటుంబ సభ్యులతో ఉండేవారని చెప్పారు. ఇప్పటికీ తమ వారు బతికున్నారో లేదో కూడా తెలియని దుస్థితి ఈ జవాన్ల కుటుంబాల్లో నెలకొందని అన్నారు. ఇక అభినందన్ విడుదల విషయానికొస్తే ఆయన పట్టుబడిన తర్వాత అక్కడి స్థానికులు అతనిపై దాడి చేసిన వీడియో బయటకు వచ్చిందని అందుకే విడుదలయ్యారని చెప్పారు. మరి 54 మంది జవాన్లు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డ సమయంలో స్మార్ట్ ఫోన్లు లేవని చెప్పారు.
భారత్ 93వేల మంది పాక్ జాతీయులను విడుదల చేసింది
పాకిస్తాన్ జైళ్లలో 54 మంది భారత జవాన్లు యుద్ధ ఖైదీలుగా ఉన్నారని వారు ఇంకా విడుదల కాలేదని... అదే సమయంలో భారత ప్రభుత్వం మాత్రం 93వేల మంది పాకిస్తానీయులను జైళ్లనుంచి విడుదల చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు మరో రిటైర్డ్ బ్రిగేడియర్ హెచ్ ఎస్ గుమాన్. ఇక్కడ ఆవేదనకు గురి చేసే విషయం ఏమిటంటే 93వేల మంది పాకిస్తానీయులను భారత్ విడుదల చేసింది కానీ పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 54 మంది జవాన్లను మాత్రం విడిపించుకోలేకపోయిందని గుమాన్ బాధపడ్డారు. ఇందుకు కారణం భారత ప్రభుత్వం వారి విడుదలకోసం మనస్ఫూర్తిగా ప్రయత్నించకపోవడమే అని అన్నారు. అంతేకాదు ప్రభుత్వాలకు జవాన్ల కుటుంబాల కన్నీళ్లు కనిపించడం లేదని తమ వారు ఎప్పటికైనా ప్రాణాలతో తిరిగి వస్తారన్న ఆశతో వారు ఎదురుచూస్తున్నారన్న సంగతి ప్రభుత్వం విస్మరిస్తోందని చెప్పారు. రక్షణశాఖలో కూడా ఈ 54 మంది జవాన్ల గురించి ఆర్మీ అధికారులు ప్రస్తావించకపోవడం దారుణమైన విషయమని గుమాన్ చెప్పారు.
మొత్తానికి పాక్ జైళ్లలో ఇలాంటి అభినందన్లు చాలామంది శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వారు ఇంకా ప్రాణాలతో ఉన్నారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. తమ వారు ఎప్పటికైనా తిరిగొస్తారనే ఆశతోనే పాకిస్తాన్కు యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డ జవాన్ల కుటుంబాలు నేటికీ ఎదురు చూస్తున్నాయి. అభినందన్ రాకతో తమ వాళ్లు కూడా విడుదలవుతారని ఆశతో ఎదురుచూస్తున్నాయి ఆ 54 మంది జవాన్ల కుటుంబాలు.