పీవీ తలచుకుని ఉంటే సిక్కుల ఊచకోత జరిగేది కాదు: ఆయన మాటలు పట్టించుకోలేదు: మన్మోహన్ సింగ్
న్యూఢిల్లీ: దేశ చరిత్రలో ఓ చీకటి రోజుగా మిగిలిపోయిన ఉదంతం.. సిక్కుల ఊచకోత. 1984 నాటి అల్లర్లుగా చరిత్ర పుటల్లోకి ఎక్కిన ఈ దారుణ ఉదంతం.. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం చోటు చేసుకుంది. దేశ రాజధానిలో కనిపించిన సిక్కులను కనిపించినట్లే ఊచకోత కోశారు దుండగులు. ఈ అల్లర్లల్లో 2,733 మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
గవర్నర్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని మమత సర్కార్: నిరసన.. గేట్ 2 నుంచి ఎంట్రీ..!
ఇందిరా గాంధీని ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. వారు సిక్కులు. అందుకే- కాంగ్రెస్ పార్టీ నాయకులు సిక్కులను లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో నరమేథాన్ని సృష్టించారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1984 అక్టోబర్ 31వ తేదీన ఇందిరాగాంధీ హత్యకు గురి కాగా.. ఆ మరుసటి రోజే అంటే నవంబర్ 1న దేశ రాజధానిలో సిక్కులపై యథేచ్ఛగా దాడులు చోటు చేసుకున్నాయి.
తాజాగా ఈ ఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మాజీ ప్రధానమంత్రి, దివంగత ఇంద్రకుమార్ గుజ్రాల్ శత జయంత్యుత్సవంలో ఆయన ప్రసంగించారు. 1984లో అప్పటి కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న పీవీ నరసింహా రావు తలచుకుని ఉండి ఉంటే- సిక్కుల ఊచకోత ఘటన చోటు చేసుకునేది కాదని అన్నారు.
ఇందిరా గాంధీ హత్యానంతరం సిక్కుల ఊచకోత కొనసాగుతోందని, దీన్ని నివారించాలని ఐకే గుజ్రాల్.. స్వయంగా నాటి హోం మంత్రి పీవీ నరసింహా రావు ఇంటికి వెళ్లి సూచించారని అన్నారు. అల్లర్లను అప్పటికప్పుడు అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ఆర్మీని దింపాలని గుజ్రాల్ చెప్పారని, దీన్ని పీవీ నరసింహా రావు పట్టించుకోలేదని చెప్పారు. పీవీ ఆయన సలహాను పాటించి ఉంటే అల్లర్లు కొనసాగేవి కావని మన్మోహన్ సింగ్ చెప్పారు.
పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని సూచించారని చెప్పారు. ఐకే గుజ్రాల్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, తామిద్దరం ఒకే ప్రాంతంలో జన్మించామని అన్నారు. రాజకీయాల్లో ఒకేసారి అడుగు పెట్టామని, ప్రధానమంత్రి స్థాయి ఉన్నత పదవుల్లో పని చేశామని చెప్పారు. ఐకే గుజ్రాల్ మేధావి వర్గానికి చెందిన రాజకీయ నాయకుడని మన్మోహన్ అన్నారు.