సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సీఎం పదవి: కాంగ్రెస్పై ప్రధాని నిప్పులు
అమృత్సర్: 2019 లోకసభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోడీ 100 ర్యాలీలలో పాల్గొననున్నారు. ఆయన గురువారం పంజాబ్ నుంచి తన ర్యాలీని ప్రారంభించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సిక్కు వ్యతిరేక అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న కమల్ నాథ్కు పట్టం కట్టింది. దీంతో ప్రధాని దీనిని ప్రస్తావించారు.
పంజాబ్ గురుదాస్పూర్లో తమ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశ రక్షణ వ్యవస్థను బలహీనపర్చేలా కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సిక్కు యాత్రికుల సౌకర్యార్థం ఎన్డీఏ ప్రభుత్వం కర్తార్పూర్ కారిడార్ నిర్మాణం కోసం చారిత్రక నిర్ణయం తీసుకుందని, కానీ, కాంగ్రెస్ దీనిని గతంలో వ్యతిరేకించిందన్నారు.
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల నిందితులకు శిక్ష పడాలని దేశం కోరుకుందని, ఈ అల్లర్ల వెనుక ఉన్నవారి పట్ల, ఇప్పుడు కనీసం వందేమాతరం, భారత్ మాతా కీ జై అనడానికి కూడా వెనకాడుతున్న వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చిందని, కానీ, అందుకు కృషి చేయలేదన్నారు.
గతంలో ఆ పార్టీ గరీబీ హఠావో అనే నినాదంతో ప్రజలను మభ్య పెట్టిన కాంగ్రెస్, ఇప్పుడు రైతు రుణమాఫీ అనే విషయంతో మోసం చేస్తోందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధరను పెంచిందని, గత ప్రభుత్వం మాత్రం దీని గురించి ఆలోచించలేదన్నారు. ఇప్పుడు మరోసారి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తోందన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామంటూ హామీలు ఇచ్చిందని, రైతులు ఆ పార్టీని ఇచ్చిన హామీలను నమ్మారని, కర్ణాటకలో కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారని, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, పంజాబ్లోనూ అదే జరిగిందన్నారు.
చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఎన్డీయే విధానాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. జీఎస్టీని మరింత సరళీకృతం చేస్తామని చెప్పారు. కేంద్రం రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఇంక్యుబేషన్ కేంద్రాలు వంటి ఎన్నో నిర్మాణాలను చేపడుతోందని, వీటి వల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 11 లక్షల మందికి ఉచిత వంట గ్యాస్ సదుపాయం కల్పించిందన్నారు. ముద్ర యోజన ద్వారా 28 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు.