1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అదృశ్యం..పెరోల్పై ఉన్న నిందితుడు మాయం
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైని వణికించిన 1993 వరస బాంబు పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుల్లో ఒకరు అదృశ్యమయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరుగా ఉన్న జలీస్ అన్సారీ అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం అన్సారీ పెరోల్పై బయట ఉన్నాడు. ముంబైలోని మోమిన్ పురా ప్రాంతంలో నివాసముండే నిందితుడు అన్సారీకి కేసులో జీవిత ఖైదు శిక్ష విధించబడింది. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబు కేసులతో ఇతనికి సంబంధాలున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాజస్థాన్లోని అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న జలీస్ అన్సారీ... 21 రోజుల పాటు పెరోల్పై బయటకు వచ్చాడు. గురువారంతో అతని పెరోల్ గడువు ముగియగా శుక్రవారం జైలుకు వచ్చి సరెండర్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే జలీస్ అన్సారీ కనిపించకుండా పోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. పెరోల్పై ఉండగా ప్రతిరోజు అగ్రిపదా పోలీస్ స్టేషన్లో ఉదయం 10:30 గంటలకు వచ్చి సంతకం పెట్టి వెళ్లాల్సిందిగా జైలు అధికారులు ఆదేశించారు. అయితే గురువారం మాత్రం పోలీస్ స్టేషన్కు సంతకం చేసేందుకు రాలేదు. 12 గంటల వరకు అధికారులు అన్సారీ కోసం చూశారు. కానీ అతను సంతకం చేసేందుకు రాలేదు.
మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన 35 ఏళ్ల కొడుకు జైద్ అన్సారీ జైలుకు వచ్చి తన తండ్రి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేశాడు. గురువారం ఉదయమే నిద్రలేచి నమాజ్ చేసుకునేందుకు మసీదుకు వెళుతున్నట్లు ఇంట్లో వారికి చెప్పిన అన్సారీ ఇక ఇంటికి తిరిగి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొడుకు ఫిర్యాదుపై అగ్రిపద పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు.
68 ఏళ్ల జలీస్ అన్సారి కోసం ముంబై పోలీసులు మరియు మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ వేటను ప్రారంభించారు. డాక్టర్ బాంబ్గా పిలువబడే జలీస్ అన్సారీ పలు ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఇందులో సిమి, ఇండియన్ ముజాహిద్దీన్లకు బాంబులు ఎలా తయారు చేయాలో శిక్షణ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 2008 ముంబై ఉగ్రదాడులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా జలీస్ను ఎన్ఐఏ విచారణ చేసింది.