1993 ముంబై వరుస పేలుళ్ల దోషి యుసుఫ్ మెమన్ మృతి
ముంబై: 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు యూసుఫ్ మెమన్ శుక్రవారం జైలులో మృతి చెందాడు. మహారాష్ట్రలోని నాసిక్ జైలులో శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.
అయితే, యూసుఫ్ ఎలా మరణించాడనే విషయాన్ని మాత్రం అధికారులు ఇంకా ధృవీకరించలేదు. ముంబైలో కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అయిన టైగర్ మెమన్కు యూసుఫ్ మెమన్ సోదరుడు. ముంబై వరుస పేలుళ్ల కేసులో 2007లో దోషిగా తేలడంతో యూసుఫ్కు జీవిత ఖైదు పడింది. దీంతో అతడిని తొలుత ముంబైలోని ఆర్థర్ రోడ్డులోని జైలులో ఉంచారు.
ఆ తర్వాత 2018లో అక్కడ్నుంచి నాసిక్ జైలుకు మార్చారు. అక్కడే శిక్ష అనుభవిస్తున్న యూసుఫ్కు శుక్రవారం ఉదయం 10.30గంటలకు గుండెపోటు రావడం మరణించినట్లు తెలిసింది. యూసుఫ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధూలేకు తరలించారు.
ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటన తర్వాత గ్యాంగ్స్టర్ టైగర్ మెమన్ భారత్ నుంచి పరారయ్యాడు. 1993 మార్చి 12న ముంబైలో బాంబు పేలుళ్ల ఘటనలో 257 మంది మృతి చెందగా, 1400 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, యూసుఫ్ సోదరుడు ఇసాక్ మెమన్ కూడా ప్రస్తుతం నాసిక్ జైలులోనే శిక్ష అనుభవిస్తున్నాడు.