అబూసలేం సహా ఏడుగురూ దోషులే: 1993 ముంబై పేలుళ్ల కేసులో టాడా కోర్టు తీర్పు
ముంబై: 1993లో ముంబై జరిగిన వరుస బాంబు పేలుళ్లపై శుక్రవారం టాడా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులోనిందితులుగా ఉన్న ముస్తఫా దోసా, అబూసలేం సహా ఏడుగురిని కోర్టు దోషులుగా తేల్చింది. ముస్తఫాను ప్రధాన కుట్రదారుగా కోర్టు తేల్చింది.
దోషలుగా తేలిన ఏడుగురిలో అబూసలేం, ముస్తఫాతోపాటు కరిముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్, రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యుమ్లు ఉన్నారు. కాగా, 24ఏళ్ల తర్వాత ఈ కేసులో కీలక తీర్పు ఈరోజు వెలువడటం గమనార్హం.
కాగా, 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో 257 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 700మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 2007లో టాడా కోర్టు తొలి దశ విచారణను పూర్తి చేసింది. అందులో 100మందిని నిందితులుగా గుర్తించగా.. మరో 23 మందిని నిర్దోషులుగా పేర్కొంది.
అయితే ఈ ట్రయల్ పూర్తయిన తర్వాతఈ కేసులో అబు సలెం, ముస్తాఫా దోసా, కరిముల్లా ఖాన్, ఫిరోజ్ అబ్దుల్, రషీద్ ఖాన్, రియాజ్ సిద్ధిఖీ, తాహిర్ మర్చంట్, అబ్దుల్ ఖయ్యుమ్లను కీలక నిందితులుగా గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పేలుళ్ల కేసులో మళ్లీ రెండో దశ విచారణను ప్రారంభించారు.
గుజరాత్ నుంచి ముంబయికి ఆయుధాలు రవాణా చేసిన ఆరోపణలతో అబు సలెంను అరెస్టు చేశారు. కాగా.. ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన బాలీవుడ్ నటుడు సంజయ్దత్కు కూడా అబుసలెం ఆయుధాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. కాగా.. మరో నిందితుడు ముస్తాఫాను ఆర్డీఎక్స్ పేలుళ్ల సూత్రధారిగా పేర్కొంటూ అరెస్టు చేశారు.
ఈ నిందితులపై 2007లో విచారణ ప్రారంభించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల నిలిపివేశారు. ఆ తర్వాత 2012లో విచారణను పునరుద్ధరించారు. విచారణలో అబుసలెం సహా మరో ముగ్గురు నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు యాకుబ్ మెమన్కు 2013లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
2015 జులై 30న యాకుబ్ను ఉరితీశారు. 1993 మార్చి 12న ముంబయి నగరం వరుస బాంబులతో దద్దరిల్లిన విషయం తెలిసిందే. రెండు గంటల వ్యవధిలో 12 చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత శక్తిమంతమైన ఆర్డీఎక్స్ను ఉపయోగించి బాంబు పేలుళ్లు జరిపిన ఘటన ఇదే. కావడం గమనార్హం.