1997 తర్వాత ఘోర ప్రమాదం, ఆనాడు ఉపహార్ థియేటర్లో ఘటన.. అప్పుడు 59 మంది, ఇప్పుడు...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అనాజ్ మందీలోగల ఓ ప్యాకింగ్ ఫ్యాక్టరీలో మంటలు చేలరేగాయి. తెల్లవారుజామున మంటలు చెలరేగడం, ఫ్యాక్టరీ ఉన్న ఝాన్సీ రోడ్ వద్ద ఇరుకుగా రహదారి ఉండటంతో అందులో ఉన్న కార్మికులు తప్పించుకోలేకపోయారు. చాలా మంది కార్మికులు ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తోంది. ఫ్యాక్టరీ వద్ద 23 మంది వరకు చనిపోగా.. ఆస్పత్రులకు తీసుకెళ్లాక మరో 20 మంది చనిపోయారు.
#Delhi: A team of National Disaster Response Force (NDRF) arrives at the incident spot. 43 people have lost their lives in the fire incident. https://t.co/jmmh95PvpM pic.twitter.com/SeG3g618E8
— ANI (@ANI) December 8, 2019
ఇరుకైన రోడ్డులో..
అనాజ్ మందీలో ప్లాస్టిక్ తయారుచేసే కంపెనీలు ఉంటాయి. ఫ్యాక్టరీలకు సమీపంలో నివాస ప్రాంతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చినా.. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీలో బీహర్కు చెందిన వారు పనిచేస్తుంటారని తెలుస్తోంది. వారు అక్కడే ఉంటూ పనిచేస్తూ.. పడుకొంటారని మరొచోట గదులు తీసుకోరని సమాచారం. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు చనిపోయారు.
షార్ట్ సర్క్యూటే..
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలానికి మంత్రులు వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రమాదస్థలాన్ని సందర్శిస్తారని తెలుస్తోంది. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు తోడు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపడుతున్నారు. ఏదైనా విపత్తు వచ్చిన సందర్భంలోనే సాయం చేసే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రపతి దిగ్బ్రాంతి..
ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందజేయాలన్నారు. ఫ్యాక్టరీలో ప్రమాదంతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దాదాపు 30 ఫైరింజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పివేయడంతో ఊపిరిపీల్చుకున్నారు.
ఆనాడు..
1997లో ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. అప్పుడు ఉపహార్ థియేటర్లో ప్రమాదం జరిగింది. అప్పుడు తొక్కసలాట కూడా జరిగి.. 59 మంది చనిపోయారు. ఆ తర్వాత అనాజ్ మందీ ఘటనేనని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. ఆనాడు ప్రాణాలు కోల్పోయిన చాలా మంది ఇప్పటికీ గుర్తొస్తున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ నాటి విషాద ఘటన ఛాయలు మరవకముందే.. మరో ఘటన జరిగింది.