కోటి ఉద్యోగాలు ఇస్తారట: జాతీయ ఉపాధి జోన్ల ఏర్పాటులో నిమగ్నమైన కేంద్రం
ఢిల్లీ: ఎన్నికలు సమీపిస్తుండటంతో మోడీ సర్కార్ యువత ఉపాధి పై దృష్టి సారించింది. ఇందుకోసం వ్యూహాలు రచిస్తోంది. రానున్న మూడేళ్లలో నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రూ.లక్ష కోట్లతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం నౌకాయాన మంత్రిత్వ శాఖ నీతిఆయోగ్తో కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నీతి ఆయోగ్ కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జాతీయ ఉపాధి జోన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనేదానిపై కూడా నీతి ఆయోగ్ కసరత్తు ప్రారంభించింది. ఈ పథకం 2019 లోక్సభ ఎన్నికలకు ముందే ప్రవేశపెట్టాలన్న యోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. తద్వారా 2014 ఎన్నికల హామీని నిలబెట్టుకున్నట్లు అవుతుందని భావిస్తోంది బీజేపీ సర్కార్.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న జాతీయ ఉపాధి జోన్ల పథకానికి రెండు విధాలుగా లాభాలున్నాయి. ఇటు ఆర్థిక పరంగా అటు ఆర్థిక రహిత రాయితీలు లభించనున్నాయి. ఇందులో టాక్స్ మినహాయింపులు, క్యాపిటల్ సబ్సిడీ, సింగిల్ విండో క్లియరెన్స్లు ఉంటాయి. స్పెషల్ పర్పస్ వెహికల్ రూట్ కింద నౌకాయాన మంత్రిత్వ శాఖ తీరప్రాంత రాష్ట్రాల్లో 14 నేషనల్ ఎంప్లాయిమెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఈ జోన్లలో 35 పారిశ్రామిక క్లస్టర్లుంటాయని, ఇందులో భాగంగా ఆహారం, సిమెంట్, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ రంగాలతో పాటు... వస్త్రాలు, లెదర్, వజ్రాలు మరియు నగల సెక్టార్లు ఉంటాయని విశ్వసనీయ సమాచారం.
ప్రాథమిక అంచనా ప్రకారం ఈ జోన్ల ఏర్పాటుకు అయ్యే మౌలిక సదుపాయాల ఖర్చు లక్ష కోట్ల వరుకు ఉంటుదని తెలుస్తోంది. ఈ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పంచుకుంటున్నట్లు సమాచారం. దీనితో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జోన్ల ఏర్పాటుకు 2వేల ఎకరాల స్థలం కేటాయించాల్సి ఉంటుంది. ఈ మెగా ప్రాజెక్టు కోసం విదేశీ సంస్థల నుంచి కూడా నిధులు సేకరించే అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో ఈ మెగా ప్రాజెక్టు పై రూ.4 లక్షల కోట్లు పెట్టుబడి కూడా పెట్టే అవకాశం కనిపిస్తోంది.
తీరప్రాంతాలను అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతకు కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించవచ్చని మాజీ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మెన్ అరవింద్ పనగారియా అప్పుడే చెప్పారు. చైనాలోని షెన్జెన్, గ్వాంగ్జౌ ప్రాంతాలను స్పెషల్ ఎకనామిక్ జోన్గా అభివృద్ధి చేయడం వల్ల అక్కడి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు భారీ స్థాయిలో కల్పించడం జరిగిందని పనగారియా గుర్తుచేశారు.