‘తొలి థాక్రే సీఎం’: రాజ్ థాక్రేకు ఉద్ధవ్ పిలుపు, కాంగ్రెస్ సీఎంలు, మమత, స్టాలిన్కు ఆహ్వానం
ముంబై: ఎన్నో మలుపుల తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే బాధ్యతలు చేపట్టబోతున్న విషయం తెలిసిందే. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు మంగళవారం ఉద్ధవ్ థాక్రేను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి గవర్నర్ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని, తమను ఆహ్వానించాలని కోరారు.
మహా ట్విస్టులు: మళ్లీ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్! శరద్ పవార్తో భేటీ తర్వాత మారిన సీన్
రాజ్ థాక్రేకు ఉద్ధవ్ ఆహ్వానం
ఈ నేపథ్యంలో శివసేన నేత ఉద్ధవ్ థాక్రే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఆహ్వానించారు. రాజ్ థాక్రేకు స్వయంగా ఫోన్ చేసిన ఉద్ధవ్ థాక్రే.. గురువారం సాయంత్రం జరిగే ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు.
బాల్ థాక్రే తర్వాత ఉద్ధవ్..
ఉద్ధవ్ థాక్రే బాబాయ్ అయిన శ్రీకాంత్ థాక్రే కుమారుడే రాజ్ థాక్రే. గతంలో రాజ్ థాక్రే కూడా శివసేనలోనే ఉండేవారు. 2004లో శివసేన పార్టీ సారథ్య బాధ్యతల విషయంలో థాక్రే కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో శివసేన వ్యవస్థాపకులు బాల్ థాక్రే తదుపరి అధినేతగా తన కుమారుడు ఉద్ధవ్ థాక్రే అని ప్రకటించారు. ఆ తర్వాత మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణెను శివసేన నుంచి బహిష్కరించారు.
శివసేనను వీడిన రాజ్ థాక్రే
దీంతో శివసేనలో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాజ్ థాక్రే శివసేన నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)పేరుతో కొత్త పార్టీని పెట్టారు. అప్పట్నుంచి ఉద్ధవ్.. రాజ్ థాక్రేల మధ్య కొంత దూరం పెరిగింది. అయితే, వీరు తమ బంధాన్ని మాత్రం పూర్తిగా తెంచుకోలేదు.
రాజ్ కుమారుడి పెళ్లికి ఫ్యామిలీతో ఉద్ధవ్..
ఇటీవల రాజ్ థాక్రే కుమారుడి వివాహ కార్యక్రమానికి ఉద్ధవ్ థాక్రే తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అంతేగాక, రాజ్ థాక్రేపై ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనూ ఆయనకు మద్దతుగా ఉద్ధవ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తొలిసారి థాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి పదవి చేపడుతుండటంతో ఉద్ధవ్.. రాజ్ థాక్రేను ఆహ్వానించారు.
సీఎం ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ సీఎంలు, మమత, కేజ్రీవాల్, స్టాలిన్
కాగా, కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు. డీఎంకే నేత ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.