సియాచిన్: మంచుగడ్డలు పడి ఇద్దరు సైనికులు మృతి
శ్రీనగర్: మంచు గడ్డలు విరిగిపడటంతో సియాచిన్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న భారత సైనిక స్థావరం. సైనికులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా భారీ మంచు గడ్డలు విరిగిపడటంతో దక్షిణ సియాచిన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు.
సహాయ బృందం వెంటనే స్పందించి మంచు చరియల కింద చిక్కుకున్న సైనికులను గుర్తించారు. వారిని తక్షణం హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు సైనికులు మరణించారు. రెండు వారాల్లో ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
కాగా, ఇటీవల సియాచిన్ ప్రాంతంపై పాకిస్థాన్ నోరుపారేసుకుంది. సియాచిన్ అనేది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్ పర్యాటకుల సందర్శనల కోసం తెరవకూడదని పాకిస్థాన్ పేర్కొంది. సియాచిన్లో భారత్ పర్యాటకాన్ని చేపట్టడంపై మీడియా అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అది వివాదాస్పద ప్రాంతమని, అలాంటి ప్రాంతంలో భారత్ పర్యాటకాన్ని ఎలా ప్రారంభిస్తుందని ప్రశ్నించారు. అయినప్పటికీ ఈ విషయంలో తాము భారత్ నుంచి ఎలాంటి మంచిని ఆశించడం లేదని వ్యాఖ్యానించారు.
భారత ప్రభుత్వం సియాచిన్ ప్రాంతంలో పర్యాటకులు సందర్శనలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా సియాచిన్ బేస్ క్యాంప్ నుంచి కుమార్ పోస్ట్ వరకు పర్యాటకులు వెళ్లేందుకు అనుమతించింది. అక్టోబర్ 21న పర్యాటకులకు అనుమతిచ్చే కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్తో కలిసి ప్రారంభించారు.