మరోసారి కాల్పులతో తెగబడ్డ ఉగ్రవాదులు: ఇద్దరు పౌరులు మృతి, మరొకరికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఆదివారం మరో ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు.
వాన్పో గ్రామంలో నివాసముంటున్న రాజా రిషి దేవ్ ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు ఆ ఇంట్లోని వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో రాజాతోపాటు జోగిందర్ అనే వ్యక్యతి మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలపాలయ్యాడు. వీరంతా స్థానికంగా కూలి పనిచేసుకుని జీవిస్తున్నారు. తాజా మరణాలతో ఇప్పటి వరకు ఉగ్రవాదుల చేతిలో మరణించిన పౌరుల సంఖ్య 11కు చేరింది.
శనివారం కూడా రెండు చోట్ల ఉగ్రవాదులు ఇదే తరహా దాడులకు తెగబడ్డారు. శ్రీనగర్లో ఓ వీధి వ్యాపారిని, పుల్వామా జిల్లాలో ఓ కార్పెంటర్ను కాల్చి చంపారు. శ్రీనగర్ లో మృతి చెందిన వ్యక్తిని బీహార్ రాష్ట్రానికి చెందిన అర్వింద్ కుమార్(37)గా పోలీసులు గుర్తించారు. పుల్వామా జిల్లాలో జరిగిన దాడిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సాగిర్ అహ్మద్ అనే కార్పెంటర్ మృతి చెందాడు.
Recommended Video
ఈ నేపథ్యంలో స్థానికేతరులను సైనికులు తమ క్యాంపులకు తరలిస్తున్నాయి. అంతేగాక, పోలీసులు, భారత సైనికులు భారీ ఎత్తున ఉగ్రవేటను కొనసాగిస్తున్నాయి. అనుమానితులను, ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. కాగా, వారం వ్యవధిలో సైన్యం ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు 13 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సుమారు పది మంది వరకు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు.