ఇంత నిర్దయగానా?: 'ఆకలి' చేసిన తప్పు.. గుండు గీసి నగ్నంగా ఊరేగించారు..
గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి నగ్నంగా ఊరేగించాడు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన.. మానవత్వం ఉన్నవారిని కంటతడి పెట్టుకునేలా చేసింది.
ముంబై: ఆకలి.. వారిద్దరిని దొంగలుగా మార్చింది. కడుపు తిప్పలు వారిని తినుబండారాలు దొంగిలించేలా చేశాయి. అంతే.. కరుడు గట్టిన నేరస్తులకు మళ్లే వారిద్దరి పట్ల షాపు యజమాని నిర్దయగా ప్రవర్తించాడు. గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి నగ్నంగా ఊరేగించాడు. ముంబైలో చోటు చేసుకున్న ఈ ఘటన.. మానవత్వం ఉన్నవారిని కంటతడి పెట్టుకునేలా చేసింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఆకలితో అల్లాడిన 8,9ఏళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలురు.. మహమ్మద్ పఠాన్(62) అనే వ్యక్తికి చెందిన మిఠాయిల దుకాణంలో చక్కిలాల ప్యాకెట్ ను దొంగిలించారు. దొంగతనాన్ని గమనించిన పఠాన్, అతని ఇద్దరి కొడుకులు ఇర్ఫాన్(25), సలీ(20) బాలురపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇద్దరిని విచక్షణారహితంగా కొట్టి, అరగుండు గీయించారు. అనంతరం చెప్పుల దండ మెడలో వేసి, వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. యజమాని ఇంతటి ఆకృత్యానికి ఒడిగడుతుంటే అడ్డుకున్నవారే లేకపోయారు. మొత్తం తతంగాన్ని ఎవరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో.. విషయం వెలుగులోకి వచ్చింది.
అనంతరం బాధితుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. చిల్డ్రన్ సెక్సువల్ యాక్ట్ కింద వారిపై కేసులు నమోదు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి, సోమవారం వరకు రిమాండ్ చేసినట్లు తెలిపారు.