సీబీఐలో లంచాధికారులు... వెలుగులోకి సంచలన అవినీతి కేసు... ఇద్దరు అధికారుల సస్పెన్షన్...
దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐలో మరోసారి ముడుపుల వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. గతంలో సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ,సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా పరస్పరం అవినీతి,అధికార దుర్వినియోగ ఆరోపణలు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో సీబీఐ విశ్వసనీయతపై అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలతో ఇద్దరు సీబీఐ అధికారులను సీబీఐ సంస్థ సస్పెండ్ చేసింది. మరో ఇద్దరు సీబీఐ అధికారులపై సంస్థాగత చర్యలకు ఉపక్రమించింది.
ఆ నలుగురు వీరే...
సీబీఐ సస్పెండ్ చేసిన అధికారుల్లో కపిల్ ధన్కడ్ అనే సీబీఐ ఇన్స్పెక్టర్,సమీర్ కుమార్ సింగ్ అనే స్టెనోగ్రాఫర్ ఉన్నారు. సంస్థాగత చర్యలను ఎదుర్కొంటున్న అధికారుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారులైన ఆర్కే రిషి,ఆర్కే సంగ్వాన్ ఉన్నారు. దాదాపు రూ.4300 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన కంపెనీల నుంచి వీరు ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. విచారణను అటకెక్కించి ఆ కంపెనీలను ఈ వ్యవహారం నుంచి గట్టెక్కించేందుకే ఈ నలుగురు లంచాలు తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి.
ఆ రెండు సంస్థలను తప్పించేందుకు...
ప్రస్తుతం సీబీఐలో ఇన్స్పెక్టర్గా ఉన్న కపిల్ ధన్కడ్ గతంలో ఎస్బీఐ మేనేజర్గా పనిచేశారు. డిప్యూటేషన్పై ఆయన సీబీఐలోకి వచ్చారు. ముడుపుల వ్యవహారంలో ఆయనకు రూ.25లక్షల దాకా ముట్టినట్లు సీబీఐ గుర్తించింది. విచారణలో రాజీపడటంతో పాటు దర్యాప్తుకు సంబంధించి కీలక సమాచారాన్ని నిందితులైన ఇద్దరు డీఎస్పీలకు ఆయన చేరవేశారన్న అభియోగాలున్నాయి. శ్రీ శ్యామ్ పల్ప్ అండ్ బోర్డ్ మిల్స్,ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థలను బ్యాంకు మోసాల నుంచి గట్టెక్కించేందుకు నలుగురు అధికారులు ఈ ముడుపుల వ్యవహారానికి తెరలేపారు.
రూ.4300కోట్లు బ్యాంకులకు కుచ్చు టోపీ
శ్రీ శ్యామ్ పల్ప్ అండ్ బోర్డ్ మిల్స్ బ్యాంకులకు రూ.700 కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టగా... ఫ్రోస్ట్ ఇంటర్నేషనల్ అనే సంస్థ దాదాపు రూ.3600 కోట్లు కుచ్చుటోపీ పెట్టింది. ఇంత భారీ మోసాలకు పాల్పడిన సంస్థలను చట్టపరమైన చర్యల నుంచి తప్పించేందుకు సీబీఐ అధికారులే లంచాలు తీసుకోవడాన్ని ఆ సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. సీబీఐ సహా ఏ ప్రభుత్వ శాఖలోనూ అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ నలుగురిపై శుక్రవారం(జనవరి 15) 8 పేజీల ఎఫ్ఐఆర్ నమోదైంది.