75 వేలకు దేశ రహస్యాల విక్రయం- ఇద్దరు రక్షణ ఉద్యోగుల అరెస్ట్- ఆపరేషన్ డెసర్ట్ ఛేజ్ సాగిందిలా..
దేశ రక్షణ వ్యవస్ధను ఎంత బలోపేతం చేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఓ చోట ఇంటి దొంగలు వాటిని నిర్వీర్వం చేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో కాసుల కక్కుర్తితో పొరుగు దేశానికి రక్షణ రహస్యాలు అమ్ముకుంటూ రాజస్ధాన్ లో ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులు దొరికిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. వీరిని ఉచ్చులోగి లాగేందుకు పాకిస్తాన్ ప్రయోగించిన హనీట్రాప్ ను మన పోలీసులు ఆపరేషన్ డిజర్ట్ ఛేజ్ పేరుతో ఏడాది పాటు కష్టపడి అద్భుతంగా ఛేదించడం మన వ్యవస్ధల సత్తాను మరోసారి నిరూపిస్తోంది.
ట్రాన్స్ జెండర్ల లింగమార్పిడి కోసం రూ.2లక్షలు చెల్లించనున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం
హనీట్రాప్ లో పడ్డారిలా...
రాజస్దాన్ లో ఉన్న పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన శ్రీగంగానగర్, బికనేర్ రెండు భారత్ కు రక్షణ పరంగా చాలా కీలకమైనవి. శ్రీగంగానగర్ లో మందుగుండు సామాగ్రి డిపో ఉండగా... బికేనర్ లో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఉంది. 29 ఏళ్ల వికాస్ కుమార్ శ్రీగంగానగర్ డిపోలో పనిచేస్తుండగా.. చిమన్ లాల్ బికనేర్ ఫైరింగ్ రేంజ్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా ఉన్నాడు. వీరిద్దరినీ హనీ ట్రాప్ చేయాలని పాకిస్తాన్ ఆర్మీకి అనుబంధంగా పనిచేసే ఐఎస్ఐ భావించింది. ముల్తాన్ కు చెందిన ఓ యువతిని అనుష్కా చోప్రా పేరుతో వీరిద్దరికీ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆమె నుంచి వచ్చే సందేశాలకు ఆకర్షితులైన వీరిద్దరూ కీలకమైన సమాచారాన్ని షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు.
మిలిటరీ ఇంటిలిజెన్స్ నిఘా...
సరిహద్దుల్లోని రక్షణ స్ధావరాలు, కీలక వ్యవస్ధలపై నిఘా ఉంచే మిలిటరీ ఇంటిలిజెన్స్ కంటికి వికాస్ కుమార్, చిమన్ లాల్ ఏడాది క్రితం చిక్కారు. వీరిద్దరిపై అనుమానం వచ్చి రాజస్ధాన్ పోలీసులతో కలిసి నిఘా పెట్టిన మిలిటరీ ఇంటిలిజెన్స్ అధికారులకు వీరి భాగోతం తెలిసింది. సైనిక స్ధావరాల్లో ఉంటూనే అక్కడి సమాచారాన్ని ఫొటోలు, వీడియోలు, సందేశాల రూపంలో పాకిస్తాన్ కు చేరవేసే వారని నిర్ధారణ అయింది. దీంతో వీరిని పక్కాగా పట్టుకునేందుకు స్కెచ్ వేశారు.
ఆపరేషన్ డిజర్ట్ ఛేజ్....
సరైన ఆధారాలు లేకుండా ఇద్దరు రక్షణ శాఖ ఉద్యోగులను అరెస్టు చేస్తే కలకలం రేగుతుంది. మిగతా వారు కూడా అప్రమత్తం అయ్యే ప్రమాదముంటుంది. అందుకే ఎక్కడా ఎవరికీ అనుమానం రాకుండా గతేడాది ఆగస్టులో ఆపరేషన్ డిజర్ట్ ఛేజ్ పేరుతో ఓ ప్రత్యేక ఆపరేషన్ కు మిలిటరీ ఇంటెలిజెన్స్ తెరలేపింది. రాజస్ధాన్ పోలీసులతో కలిసి దాదాపు ఏడాదిగా నిర్వహించిన ఈ ఆపరేషన్ లో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. దేశ రహస్యాలు పాకిస్తాన్ ముష్కరులకు ఎలా చేరుతున్నాయో నిర్ధారణ అయింది. పక్కా ఆధారాలతో తాజాగా వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న జాయింట్ ఆపరేషన్ టీం అరెస్ట్ చేసి మిలిటరీ కోర్టులో హాజరుపరిచింది.
75 వేల కోసం రహస్యాల అమ్మకం..
వికాస్ కుమార్, చిమన్ లాల్ ను పట్టుకున్న మిలిటరీ ఇంటిలిజెన్స్ అధికారులు వారిని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇందులో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. కేవలం 75 వేల రూపాయల కోసం వీరిద్దరూ తీవ్రవాద ముఠాలకు అమ్ముడుపోయారని దర్యాప్తులో తేలింది. దీంతో విచారణ అధికారులు సైతం విస్తుపోతున్నారు. సరిహద్దుల్లో ఇలాంటి దేశ ద్రోహులు ఇంకా ఎంతమంది ఉన్నారన్న అంశంపై మిలిటరీ ఇంటెలిజెన్స్ విచారణ నిర్వహిస్తోంది.