పాక్ కాల్పులు: దంపతుల మృతి, ముగ్గురు జవాన్లకు గాయాలు
సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది.
శ్రీనగర్: సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. జమ్మూకాశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడింది. గుల్పురా ప్రాంతంలోని నియంత్రణ రేఖ వద్ద శనివారం ఉదయం నుంచి పాక్ రేంజర్లు జరుపుతున్న కాల్పుల్లో భార్యాభర్తలు మృతిచెందారు.
ఈ కాల్పుల్లో వారి చిన్నారులు కూడా గాయపడ్డారు. కాగా, మృతి చెందిన వ్యక్తి భారత జవాను అని ప్రాథమికంగా తెలిసింది. కాల్పుల నేపథ్యంలో భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎదురుకాల్పులు చేపట్టి పాక్ సైన్యానికి ధీటుగా బదులిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, బాందిపొరా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. హాజిన్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్విహిస్తున్న బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఓ వైపు చైనా-భారత్ సరిహద్దులో చైనా బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా, మరో వైపు పాక్ ఇలా కాల్పులు తెగబడుతుండటం గమనార్హం.