శబరిమల యాత్రికుల కోసం అద్భుతం- విద్యుత్, పంపింగ్ లేకుండానే 2 కోట్ల లీటర్ల నీరు
సుదూర ప్రాంతాల నుంచి శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మకర జ్యోతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇక్కడి దేవస్ధానం బోర్డు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా భక్తులకు అందించే తాగునీరు విషయంలో ఈసారి పలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
శబరిమలకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం ప్రతీ రోజూ 2 కోట్ల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఎలాంటి విద్యుత్ వాడకం కానీ పంపింగ్ కానీ లేకుండానే ఇంత భారీ స్ధాయిలో నీటిని నిల్వ చేస్తుండటం ఇక్కడ విశేషం. శబరిమల సన్నిధానంలో ఎలాంటి మోటార్లూ వాడకుండా ఈ నీటిని నిల్వ చేస్తున్నారు. కున్నార్ డ్యామ్ నుంచి గ్రావిటీ ద్వారా సన్నిధానంలోని పండితవాలానికి ఈ నీరు చేరుతోంది. దీన్ని ఇక్కడ 9 భారీ జలాశయాల్లో నిల్వచేస్తున్నారు.
శబరిమల కొండపై ఉన్న ఈ 9 రిజర్వాయర్లకు చేరిన నీరు అక్కడే ఉన్న భవనాలకు కూడా ఎలాంటి విద్యుత్ వాడకం లేకుండానే చేరుతోంది. ఈ 9 రిజర్వాయర్లలో ఐదింటిలో ఎప్పుడూ నీరు నిండుగా ఉండేలా చూస్తారు. మిగతా నాలుగు రిజర్వాయర్ల నుంచే భవనాలకు నీటిని పైపుల ద్వారా సరఫరా చేస్తారు. సన్నిధానం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అడవుల్లో ఉన్న కున్నార్ డ్యామ్ నుంచి దాని దిగువన ఉన్న సన్నిధానం రిజర్వాయర్లకు ఈ నీరు సహజంగానే వచ్చి చేరుతుంది. ఈ పైపులను ఏనుగులు ఈ ఏడాది మూడుసార్లు ధ్వంసం కూడా చేశాయి.
ఈ రిజర్వాయర్లలో భక్తుల కోసం నిల్వచేసిన నీటిని ప్రతీ రెండు గంటలకోసారి క్లోరినేషన్ చేస్తుంటారు. అలాగే ప్రతీ రోజూ నీటి నాణ్యతను పరీక్షిస్తుంటారు. గత 20 ఏళ్లుగా కొచ్చి పెరుంబలానికి చెందిన టీపీ ప్రదీష్ ఇక్కడ క్లోరినేషన్ ఆపరేటర్గా ఉన్నారు. ఇక్కడ తాజాగా నిర్మించిన రిజర్వాయర్లో 70 లక్షల నీటిని నిల్వ చేసేందుకు అవకాశముంది. అలాగే మరో 6 రిజర్వాయర్లలో ఒక్కో చోట 20 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే అవకాశముంది. రోజుకు సన్నిధానానికి వచ్చే భక్తులకు 70 లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది. భారీగా జనం రద్దీ ఉండే రోజుల్లో మాత్రం రోజుకు ఈ వాడకం కోటీ 15 లక్షల లీటర్లకు చేరుతుంది.