ఎన్కౌంటర్: ఉగ్రవాదులుగా మారిన పోలీసులు హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు కాల్చి చంపాయి. అనంతరం, డిఫెన్స్ పీఆర్వో ఎస్ఎన్ ఆచార్య మాట్లాడుతూ.. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు గత నెల వరకు భారత బలగాల్లో ప్రత్యేక పోలీసు అధికారులు(ఎస్పీవో)గా పనిచేశారని వెల్లడించారు.
2010 నుంచి వారు ఎస్పీఓ అధికారులుగా పని చేశారని చెప్పారు. ఆ తర్వాత, సెప్టెంబర్ 6, 7 తేదీల్లో వీరిద్దరూ ఆయుధాలతో సహా పారిపోయి ఉగ్రవాదులతో చేయి కలిపారని తెలిపారు.
గతంలో కూడా వీరు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని... అయితే, అప్రూవర్గా మారిపోయారని... దీంతో, సైన్యానికి సహాయం చేసే నిమిత్తం 2010లో వీరికి ప్రత్యేక అధికారులుగా బాధ్యతలను అప్పగించినట్టు తెలిపారు.
మావోయిస్టుల ఘాతుకం
ఒరిస్సా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజన యువకులను మావోయిస్టులు కాల్చి చంపారు. కలిమెల పోలీస్స్టేషన్ పరిధిలోని కన్నగూడలో ఈ ఘటన జరిగింది. మృతుల్లో రమా మాడి, తోమా మాడిలున్నారు. ఈ సంఘటన ఒడిశాలో సంచలనం సృష్టించింది.
ఉత్తరప్రదేశ్లో పేలుళ్లు: ఆరుగురు మృతి
ఉత్తరప్రదేశ్ సోన్భద్ర మైన్స్లో జరిగిన పేలుళ్లలో ఆరుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.