యూపీలో అమ్మోనియా గ్యాస్ లీక్: ఇద్దరు మృతి.. 15 మందికి అస్వస్థత..
ఉత్తర్ ప్రదేశ్లో భారీ గ్యాస్ లీకేజీ జరిగింది. ప్రయాగ్రాజ్, ఫూల్పూర్లోని ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్స్లో గ్యాస్ లీక్ అయ్యింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 15 మందికి గాయాపడ్డారు. చనిపోయిన వారిని వీపీ సింగ్, అభ్యనందన్ కుమార్గా గుర్తించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరగొచ్చునని ప్రయాగ్రాజ్ కలెక్టర్ భాను చంద్ర గోస్వామి తెలిపారు.
గ్యాస్ లీకేజీని నిలిపివేశామని, తాత్కాలికంగా ప్లాంట్ను మూసేసినట్లు ఆయన చెప్పారు. ప్రాథమిక విచారణ ప్రకారం పైప్ లీక్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. చనిపోయిన వీపీ సింగ్ అసిస్టెంట్ మేనేజర్ అని, అభయానంద్ కుమార్ డిప్యూటీ మేనేజర్ అని తెలిపారు. ఘటనాస్థలానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకొని.. సహాయక చర్యలకు చేపట్టాయి.
ప్లాంట్ నంబర్ 2 నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ జరిగి ఉంటుందని తెలుస్తోంది. అర్ధరాత్రి లీక్ కాగా.. ఆ సమయంలో 100 మంది సిబ్బంది ఉన్నారు. గ్యాస్ లీకయిన వెంటనే కొందరు పారిపోగా.. మరికొందరు బయటకు వెళ్లలేకపోయారు. ప్రమాదం జరిగిన ప్లాంట్ క్లోజ్ చేశామని అధికారులు తెలిపారు. లీకేజీ కూడా ఆగిందని.. బయటి వారు ఎవరు లీక్ వల్ల ప్రభావితం కాలేదని చెప్పారు. ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు.