కోర్టు ముందు హాజరైన ఏనుగు, ఏనుగు పిల్ల
గౌహతి: హంతకులు, నేరస్తులు, కరుడుగట్టిన తీవ్రవాదులు, చిన్ని చిన్న నేరాలు చేస్తున్న వారిని కోర్టు ముందు విచారణకు హాజరు పరచడం మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగేదే. అయితే ఒక ఏనుగు, ఏనుగు పిల్లను (తల్లి, బిడ్డ) కోర్టు విచారణకు తీసుకు వచ్చారు.
న్యాయస్థానం ముందు హాజరైన ఆ ఏనుగులను చూడటానికి వందలాధి మంది తరలి వచ్చారు. విచిత్రమైన ఈ సంఘటన భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులోని అసోం రాష్ట్రంలో జరిగింది. అసోం రాష్ట్రంలోని హైలాకండి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బంగ్లాదేశ్ సరిహద్దులోని ఒక గ్రామంలో నివాసం ఉంటున్న భారతీయుడు రెండు ఏనుగులను గుర్తించి అవి తనవే అంటు తీసుకు వెళ్లాడు. 8 సంవత్సరాల క్రితం తన దగ్గర ఉన్న ఆడ ఏనుగును గుర్తు తెలియని వ్యక్తులు తీసుకు వెళ్లారని ఆరోపించాడు.
అయితే బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న ఏనుగు, దాని బిడ్డ కొన్ని రోజుల నుండి కనపడటం లేదని, బంగ్లాదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని, సరిహద్దులో ఉన్న గస్తి అధికారులకు విషయం చెప్పానని అంటున్నాడు. సరిహద్దు గస్తి అధికారులు భారత్ గస్తి అధికారులతో సంప్రదించారని చెప్పారు.
భారత్ ఆర్మీ బలగాలు సమాచారం ఇవ్వడంతో తన రెండు ఏనుగులను ఎలాగైన తన ఊరికి తీసుకు వెళ్లాలని వచ్చానని అంటున్నాడు. ఈ వివాదం కోర్టు మెట్లు ఎక్కింది. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి రెండు ఏనుగులను తీసుకు రావాలని పోలీసులకు సూచించారు.
పోలీసులు రెండు ఏనుగులను కోర్టు ఆవరణంలోకి తీసుకు వచ్చారు. జడ్డి బయటకు వచ్చి రెండు ఏనుగులను చూశారు. కేసు విచారణ జరుగుతున్నందున రెండు ఏనుగులను స్థానిక అటవి శాఖ అధికారులకు అప్పగించాలని జడ్జ్ ఆదేశాలు జారీ చేశారు.
రెండు ఏనుగులు తమ దగ్గర ఉన్నాయని, వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నామని స్థానిక అటవి శాఖ డివిజన్ అధికారి గున్నిన్ సైకియా అంటున్నారు. మొత్తం మీద రెండు దేశాలకు చెందిన ఇద్దరు రెండు ఏనుగుల కోసం అసోంలోని కోర్టును ఆశ్రయించారు.