క్యాన్సర్ తగ్గాలని శివాలయంలో జాగారం.. మహిళపై కామాంధుల అఘాయిత్యం..
అసలే పేదరికం.. అరకొర సంపాదన.. వచ్చేదంతా పిల్లల తిండికే సరిపోతుంది.. అయినాసరే బతుకీడుస్తుండగా అనుకోని విషాదం.. ఆ పేదింటి మహిళకు సర్వికల్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్లు తేల్చారు.. లక్షలు పోసి ట్రీట్మెంట్ చేయించుకునే స్థోమత లేదు.. శివరాత్రి సందర్భంగా ఐదు రోజుల పాటు జాగారం చేస్తే జబ్బు తగ్గిపోవచ్చని తెలిసినవాళ్లెవరో సలహా ఇచ్చారు.. భగవంతుడిపైనే భారం వేసి ముందుకు కదిలిందామె.. చివరికి శివాలయంలో కూడా ఆమెకు దారుణమైన అనుభవం ఎదురైంది..
శివాలయంలో జాగారం చేస్తున్న మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లి రేప్ చేసేందుకు యత్నించిన ముగ్గురు కామాంధుల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశాలోని కేంద్రపార జిల్లా కేరెదగద గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాజ్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి తపన్ కుమార్ నాయక్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి..
కేరదగద గ్రామానికే చెందిన మహిళ(35) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. శివరాత్రి సందర్భంగా శివాలయంలో ఐదు రోజులు జాగారం చేస్తే జబ్బు తగ్గిపోతుందని ఎవరో చెబితే నమ్మింది. బుధవారం రాత్రి గ్రామ శివారులోని శివాలయానికి ఒంటరిగా వెళ్లి, జాగారం ప్రారంభించింది. అర్ధరాత్రి తర్వాత అటుగా వచ్చిన ముగ్గురు దుండగులు.. ఆమెను ఎత్తుకెళ్లి రేప్ చేసేందుకు ప్రయత్నించారు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. కాగా..
బాధితురాలి ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శుక్రవారం ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుణ్ని కూడా పట్టుకుంటామని సీఐ తపన్ నాయక్ చెప్పారు. బాధిత మహిళ గాథవిన్న పోలీసులు.. శివరాత్రి ముగిసే దాకా ఆలయం వద్ద సెక్యూరిటీ ఏర్పాటుచేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె తన జాగారాన్ని కొనసాగిస్తోంది.