వామ్మో.. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరికీ పాజిటివ్..505కి చేరిన పాజిటివ్ కేసులు, 17 మంది...
ఇటీవల యూఏఈ నుంచి రెండు విమానాల్లో ప్రవాస భారతీయులు కేరళకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిలో ఇద్దరికీ కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని కేరళ వైద్యారోగ్యశాఖ అధికారులు ధృవీకరించారు. వీరి ఇద్దరితో రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 505కి చేరింది. ప్రస్తుతం 17 మందికి చికిత్స అందిస్తున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
Recommended Video
కరోనా లాక్ డౌన్: 100 మంది సీపీఎం మహిళలపై ఖాకీల లాఠీచార్జీ, ఎక్కడో, ఎందుకో తెలుసా...?
ఇద్దరికీ పాజిటివ్..
ఇడుక్కికి చెందిన ఒకరు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో ఇద్దరికి కొచ్చి, కోజికోడ్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వీరిద్దరూ ఈ నెల 7వ తేదీన దుబాయ్, యూఏఈ నుంచి కేరళ చేరుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రస్తుతం 23 వేల 930 మంది పరిశీలనలో ఉన్నారని... 334 మంది ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 505 కాగా.. 485 మంది కోలుకున్నారు. ముగ్గురు చనిపోగా.. 17 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
క్వారంటైన్ తప్పనిసరి
ఇటీవల యూఏఈ నుంచి వచ్చినవారిని 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అని సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టంచేశారు. వలసకూలీలు కేరళ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 2 లక్షల ఆప్లికేషన్లు రాగా.. ఇందులో మెజార్టీ సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ జడలువిప్పి నాట్యం చేస్తోంది.
6 చెక్ పోస్టులు..
వైరస్ లక్షణాలు కనిపిస్తే చాలు.. పరీక్ష చేస్తామని.. అవసరమైతే ఐసోలేసన్ వార్డుకు తరలిస్తామని విజయన్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆరు సరిహద్దు చెక్ పోస్టుల నుంచి పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. పాస్ లేకుంటే రానీయమని తెలిపారు. రాష్ట్రంలో 207 ప్రభుత్వ వైద్యశాలలు, 125 ప్రైవేట్ ఆస్పత్రులు, 27 ఆస్పత్రులు.. కరోనా వైరస్ కోసం చికిత్స అందిస్తున్నాయని పినరయి విజయన్ వెల్లడించారు.