అనంతనాగ్లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా హకూరా బోదస్గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. 'తిరిగి గ్రామానికి' అనే ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించడం గమనార్హం.
పేలుడు ఘటనలో గాయపడినవారిని అనంతనాగ్ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇది ఇలావుండగా, హజ్రత్బల్లోని సర్ సయ్యద్ గేట్ ఆఫ్ కాశ్మీర్ యూనివర్సిటీ సమీపంలోని మార్కెట్ వద్ద మరో సేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ముగ్గురు పౌరులకు గాయాలయ్యాయి. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఇది తక్కువ తీవ్రత గల పేలుడని పోలీసు అధికారులు చెప్పారు. ఈ పేలుడు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఇటీవల ఓ జాతీయ రహదారిపై ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీని పోలీసులు గుర్తించి దాన్ని నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది.