కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ చేతక్: పైలెట్లు దుర్మరణం
న్యూఢిల్లీ: ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. దట్టమైన అడవుల్లో కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. రెండు రోజుల కిందటే వైమానిక దళానికి చెందిన మిగ్-21 ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అంతలోనే- ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిపోవడం కలకలం రేపుతోంది. చేతక్ హెలికాప్టర్ల పనితీరుపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందించాలంటూ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆదేశించారు. భూటాన్ ఆర్మీతో కలిసి ఈ ఘటనపై సంయుక్త దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
భూటాన్ భూభాగంపై ఉన్న యాంగ్ఫులా డొమెస్టిక్ విమానాశ్రయానికి సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన మేఘాలు అలుముకోవడం, ఓ మోస్తరు వర్షం కురుస్తుండటం ప్రమాదానికి కారణమైనట్లు నిర్ధారించారు. మన దేశ ఆర్మీకి చెందిన లెప్టినెంట్ కల్నల్ స్థాయి ర్యాంక్ గల పైలెట్, రాయల్ భూటాన్ ఆర్మీ పైలెట్ ఈ ప్రమాదంలో కన్నుమూసినట్లు సైన్యాధికారులు ధృవీకరించారు.
చేతక్ హెలికాప్టర్ గాల్లోనే పేలిపోయినట్లు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే అస్సాం సరిహద్దుల్లోని అధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. సహాయక చర్యలు చేపట్టడానికి వాతావరణం అనుకూలించట్లేదని తెలుస్తోంది.
కాగా, మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లా చౌదరీ కా పురా ప్రాంతంలో రెండు రోజుల కిందట వైమానిక దళానికి చెందిన ప్రతిష్ఠాత్మక మిగ్ 21 యుద్ధ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పైలెట్లు సురక్షితంగా తప్పించుకున్నారు. ఈ ఘటన చోటు చేసుకున్న 48 గంటలు కూడా గడవక ముందే.. ఈ సారి చేతక్ హెలికాప్టర్ కుప్పకూలిపోవడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది.
వాతావరణ కారణాల వల్లే చేతక్ ప్రమాదానికి గురైనప్పటికీ.. ఎలాంటి పరిస్థితుల నుంచైనా సురక్షితంగా బయటపడగల శక్తి సామర్థ్యాలు ఆ హెలికాప్టర్ కు ఉన్నాయని అంటున్నారు.