విషాదం : అద్దాలు తుడుస్తూ ఇద్దరు మృతి
ఢిల్లీ: దేశ రాజధానిలో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చేస్తున్న ఉద్యోగం ఇద్దరు యువకుల ప్రాణం తీసింది. బిల్డింగ్ అద్దాలు తుడుస్తుండగా ప్రమాదవశాత్తూ పదో అంతస్తు నుంచి కిందపడటంతో వారు ప్రాణాలు వదిలారు. సెంట్రల్ ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. కుటుంబానికి ఆసరాగా నిలిచిన కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.
కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలో కొనసాగుతున్న కాల్పులు...మరో జవాను మృతి..
సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో సెంట్రల్ ఢిల్లీలోని వీడియోకాన్ టవర్స్ బిల్డింగ్ అద్దాలు శుభ్రం చేసే పని నడుస్తోంది. రాజు శర్మ (22), అష్తియాక్ ఖాన్ (23) ఆ పనిలో బిజీగా ఉన్నారు. పదో అంతస్తు అద్దాలు తుడుస్తుండగా ఊహించని పరిణామం జరిగింది. వారు కూర్చున్న స్టాండ్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో రాజు, అష్తియాక్లు ఒక్కసారిగా కిందపడిపోయారు. పదో అంతస్తు నుంచి కింద పడటంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన డాక్టర్లు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ప్రమాదం జరిగిన సమయంలో మృతులిద్దరూ హెల్మెట్ గానీ సేఫ్టీ బెల్ట్గానీ పెట్టుకోలేదని పోలీసులు చెప్పారు. ఘటనాస్థలిలో అసలు ఎలాంటి రక్షణ పరికరాలు లేవని గుర్తించారు. వీడియోకాన్ టవర్స్ క్లీనింగ్ వర్క్ను ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి అప్పగించారు. కంపెనీ తరఫున రాజు, అష్తియాక్లు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదిగొచ్చిన బిడ్డలు విగత జీవులుగా మారడంతో కన్నవారి రోదనలకు మిన్నంటాయి. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్యోగుల రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.