గృహ నిర్బంధంలోనూ ఆంక్షలు సడలింపు: పార్టీ నేతలతో మాజీ ముఖ్యమంత్రులు భేటీ: రాజకీయాల్లేవట
శ్రీనగర్: నేషనల్ కార్ఫరెన్స్ సీనియర్ నేతలు, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఫరూఖ్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లాలకు ఎట్టకేలకు కాస్త ఊరట లభించింది. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గృహ నిర్బంధాన్ని కొనసాగిస్తూనే..ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలతో పార్టీ నాయకులు సమావేశం కావడానికి అనుమతి ఇచ్చింది.
పార్టీ నాయకులు గానీ, బయటి వ్యక్తులు గానీ వారిని కలుసుకోవడం ఈ రెండు నెలల కాలంలో ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్ ను స్వయం ప్రతిపత్తి హోదా గల రాష్ట్రంగా గుర్తించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడానికి ఒకరోజు ముందే కేంద్ర ప్రభుత్వం వారిని గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఆగస్టు 5వ తేదీన కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయగా.. 4వ తేదీనాడే వారిని హౌస్ అరెస్ట్ లో ఉంచింది. అప్పటి నుంచీ వారు నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. తాజాగా ఆంక్షలను కొద్దిగా సడలించింది.
నేషనల్ కాన్ఫరెన్స్ కు చెందిన ఆద్దరు పార్టీ ముఖ్య నాయకులు హస్నయిన మసూది, అక్బర్ లోనే ఆదివారం ఉదయం ఫరూఖ్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లా వారిని సాదరంగా స్వాగతించారు. సుమారు గంటకు పైగా వారు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయనేది తేలాల్సి ఉంది. త్వరలో రాష్ట్రంలో నిర్వహించబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది.
తమ మధ్య ఎలాంటి రాజకీయాల విషయాలు చర్చకు రాలేదని, యోగక్షేమాలను మాత్రమే తెలుసుకున్నామని హస్నయిన్ తెలిపారు. హస్నయిన మసూదీ, అక్బర్ లోనేలతో పాటు సుమారు 15 మంది పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి మధ్య చర్చకు రావాల్సిన అంశాలపై భద్రతా బలగాలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చేరవేస్తారనే అనుమానంతోనే తాము ఎలాంటి రాజకీయ అంశాలపైనా చర్చించ లేదని నేషనల్ కార్ఫరెన్స్ నాయకులు, ప్రతినిధి బృంద సభ్యులు స్పష్టం చేసి ఉండొచ్చని చెబుతున్నారు.