మలద్వారంలో బంగారం... అక్రమ రవాణా.. పట్టుకున్న కస్టమ్స్ అధికారులు...
దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.42కి.గ్రా బంగారు పేస్ట్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.85 లక్షలు ఉంటుందని తెలిపారు. దుబాయ్ నుంచి చెన్నై వచ్చిన అంతర్జాతీయ విమానంలో వచ్చిన ప్రయాణికులను అనుమానంతో తనిఖీ చేయగా.. బంగారం పేస్ట్ బయటపడినట్లు వెల్లడించారు. మల ద్వారంలో బంగారం పేస్టును పెట్టుకుని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు.
బంగారంతో పాటు వీరి వద్ద నుంచి ల్యాప్టాప్స్,సిగరెట్లు,స్మార్ట్ఫోన్లు,లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.12.4లక్షలు ఉంటుందన్నారు. దుబాయ్ నుంచి 6E 8246 విమానంలో వీరు చెన్నై వచ్చినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
చెన్నై విమానాశ్రయంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే బయటపడ్డాయి. గతేడాది నవంబర్లో దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.58లక్షలు విలువ చేసే 1.11కి.గ్రామ బంగారు పేస్ట్ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మల ద్వారంలో బంగారం పేస్టును పెట్టుకుని అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డారు.కస్టమ్స్ యాక్ట్ 1962 ప్రకారం వీరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
బంగారం క్యాప్సుల్స్ను మల ద్వారంలోకి చొప్పించుకుని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ఘటనలు గతంలో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనూ వెలుగుచూశాయి.బంగారాన్ని పేస్టులా మార్చి, క్యాప్సూల్స్ రూపంలో ఉండలుగా చుట్టి మలద్వారంలో దాన్ని చొప్పించుకుని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.