ఉత్తరాఖండ్ జలవిలయం : కొట్టుకుపోయిన రెండు ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలు... 153 మంది గల్లంతు
ఉత్తరాఖండ్లో ఆదివారం(ఫిబ్రవరి 7) సంభవించిన జలవిలయానికి రెండు ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇందులో ఒకటి తపోవన్ విద్యుత్ కేంద్రం కాగా.. మరొకటి రైనీ విద్యుత్ కేంద్రం. ఈ రెండు కేంద్రాల్లో పనిచేస్తున్న దాదాపు 153 మంది వరదల్లో గల్లంతయ్యారు. వీరిలో 25-30 మంది తపోవన్ సమీపంలోని ఒక టన్నెల్లో ఇరుక్కుపోయి ఉంటారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ టన్నెల్ రెండు వైపులా మూసి ఉంటుంది కాబట్టి అందులో ఇరుక్కుపోతే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. ఐటీబీపీ,ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
Recommended Video
170 మంది గల్లంతు...
ఉత్తరాఖండ్ వరదలకు భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవించింది. ఇప్పటివరకూ 14 మృతదేహాలను వెలికితీయగా... మరో 170 మంది గల్లంతైనవారి ఆచూకీ తెలియాల్సి ఉంది. భారీ వరదల ధాటికి అలకనంద,దౌలీగంగ,రుషి గంగ నదులపై బ్రిడ్జిలు,ఆనకట్టలు,రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రుషి గంగ,దౌలీ గంగ నదుల సంగమ క్షేత్రం వద్ద ఉన్న తపోవన్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ డ్యామ్ పూర్తిగా కొట్టుకుపోయింది.
టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే ప్రయత్నాలు...
రైనీ పవర్ ప్రాజెక్టుకు చెందిన 32 మంది,తపోవన్ ప్రాజెక్ట్కు చెందిన 121 మంది వరదల్లో గల్లంతయ్యారు. వీరిలో 12 మంది తపోవన్ ప్రాజెక్టు సమీపంలోని మొదటి టన్నెల్లో చిక్కుకుపోగా ఐటీబీపీ రెస్క్యూ టీమ్ వారిని రక్షించింది. ఈ టన్నెల్కు 2.5కి.మీ దూరంలో ఉన్న మరో టన్నెల్లో 30మంది వరకు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. వీరిన సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు గత రాత్రి నుంచి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.
కొట్టుకుపోయిన బ్రిడ్జిలు
చైనా సరిహద్దుల్లోని బోర్డర్ పోస్టులకు వెళ్లేందుకు కీలక మార్గంగా ఉన్న రేణి బ్రిడ్జి కూడా ఈ వరదల్లో కొట్టుకుపోయింది. అలాగే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్లోని మరో నాలుగు బ్రిడ్జిలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. దీంతో సమీప గ్రామాల్లోకి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో రుషి గంగ నదికి అవతలి వైపు ఉన్న గ్రామాల్లో అధికారులు హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నారు.
ఎక్స్గ్రేషియా ప్రకటన...
వరదల్లో చనిపోయినవారి కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. అటు ఉత్తరాఖండ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించింది. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద, ధౌలిగంగ నదులకు అకస్మాత్తుగా భారీ వరదలు ముంచెత్తడంతో ఈ జలవిలయం సంభవించింది.